కాలగర్భంలో గ్రామ చావిడి!
ABN , Publish Date - Oct 01 , 2025 | 02:13 AM
రెవెన్యూ సేవలు అందించడం కోసం ఒంగోలులో తొలిసారిగా నిర్మించిన వీఆర్వోల కార్యాలయం (గ్రామ చావడి) కాలగర్భంలో కలిసిపోయింది. స్థానిక గాంధీరోడ్లోని గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న గ్రామచావడి వందేళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది.
ఒంగోలులోని వీఆర్వోల కార్యాలయం తొలగింపు
ఒంగోలు కార్పొరేషన్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సేవలు అందించడం కోసం ఒంగోలులో తొలిసారిగా నిర్మించిన వీఆర్వోల కార్యాలయం (గ్రామ చావడి) కాలగర్భంలో కలిసిపోయింది. స్థానిక గాంధీరోడ్లోని గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న గ్రామచావడి వందేళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. పూర్వం రెవెన్యూ సేవల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లకుండా ముందుగా వీఆర్వోలను కలిసేందుకు ప్రత్యేకంగా దీనిని ఏర్పాటు చేశారు. బ్రిటీష్ కాలంలో సుమారు 120 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ చావడిలో సుదీర్ఘకాలంగా వీఆర్వోలు సేవలు అందించారు. కాలానుగుణంగా ఆన్లైన్ విధానం, ఆ తర్వాత వార్డు సచివాలయాలు అందుబాటులోకి రావడంతో కొన్నేళ్లుగా ఈ కార్యాలయం మూతపడి నిరుపయోగంగా మారింది. మంగళవారం రెవెన్యూ అధికారులు దానిని పూర్తిగా తొలగించారు. అందిన సమాచారం మేరకు ఆ స్థలంలో త్వరలో నూతనంగా భవనం నిర్మించి రెవెన్యూ సేవలను పునరుద్ధరించనున్నట్లు సమాచారం.