సత్తాచాటిన నంద్యాల ఎడ్లు
ABN , Publish Date - May 31 , 2025 | 11:01 PM
తర్లుపాడులోని నీలంపాటి లక్ష్మీ అమ్మవారి తిరుణాళ్ల సందర్భంగా శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీల్లో నంద్యాల జిల్లా ఎడ్లు సత్తాచాటాయి. మొత్తం 11 జతలు గిత్తలు ఈ పోటీలో పాల్గొన్నాయి.
తర్లుపాడు, మే 31 (ఆంధ్రజ్యోతి) : తర్లుపాడులోని నీలంపాటి లక్ష్మీ అమ్మవారి తిరుణాళ్ల సందర్భంగా శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీల్లో నంద్యాల జిల్లా ఎడ్లు సత్తాచాటాయి. మొత్తం 11 జతలు గిత్తలు ఈ పోటీలో పాల్గొన్నాయి. నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామానికి చెందిన దీనం సుబ్రహ్మణ్ణేశ్వరరెడ్డి ఎడ్లు 2500 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ బహుమతి రూ.60వేలు గెలుపొందాయి. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం బల్లికురవ గ్రామానికి చెందిన పావులూరి వీరస్వామి ఎడ్లు 2253 అడుగుల దూరాన్ని లాగి ద్వితీయ బహుమతి రూ.50వేలు కైవసం చేసుకున్నాయి. నంద్యాల జిల్లా మిడతూరు మండలం అలగనూరుకు చెందిన మేడం రోణి ఎడ్లు 2105 అడుగులతో మూడో బహుమతి రూ.40వేలు, నంద్యాల జిల్లా గోశపాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన పృత్విక్ రెడ్డి, దినేశ్రెడ్డి ఎడ్లు 2085 అడుగులతో నాలుగో బహుమతి రూ.30వేలు, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బొడిచర్ల గ్రామానికి చెందిన సింగి నక్షత్రారెడ్డి ఎడ్లు 2050 అడుగుల దూరంతో ఐదో బహుమతిగా రూ.20వేలు, బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన శ్రీరాములమ్మ ఎడ్లు 2020 అడుగులతో ఆరో బహుమతిగా రూ.15వేలు, ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం జేసీ అగ్రహారం గ్రామానికి లక్కా నాగశివశంకర్ ఎడ్లు 1847 అడుగుల దూరాన్ని లాగి ఏడో బహుమతిగా రూ.10వేలు, నంద్యాల జిల్లా గడివేమలు మండలం పేసరవాయి గ్రామానికి చెందిన సయ్యద్ కలాం బాషా ఎడ్లు 1845 అడుగుల దూరాన్ని లాగి రూ.8వేలు గెలుపొందాయి. ఎడ్ల పోటీలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గెలుపొందిన ఎడ్ల యజమానులకు కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు. భారీ స్థాయిలో అన్నదానం ఏర్పాటు చేశారు.