ప్లాస్టిక్ నివారణే లక్ష్యం
ABN , Publish Date - Jul 20 , 2025 | 01:24 AM
ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యమని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉద్ఘాటించారు. ప్రజలంతా చైతన్యవంతులై సహరించాలని కోరారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వపరంగా అవగాహన ర్యాలీలు నిర్వహించారు.
జిల్లావ్యాప్తంగా అవగాహన ర్యాలీలు
మార్కాపురంలో పాల్గొన్న మంత్రి స్వామి, కలెక్టర్
ఇతరచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు
ఒంగోలు, జూలై 19 (ఆంధ్రజ్యోతి) ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యమని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉద్ఘాటించారు. ప్రజలంతా చైతన్యవంతులై సహరించాలని కోరారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వపరంగా అవగాహన ర్యాలీలు నిర్వహించారు. పలుప్రాంతాల్లో కీలక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ ముఖ్యనేతలు, వివిధ స్థాయిల్లోని అధికారులు పాల్గొన్నారు. ప్రతినెలా మూడో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఈ శనివారం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం అనే నినాదంతో ప్రజా చైతన్య కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ప్రత్యేకించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలు, వాటి నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది. తదనుగుణంగా జిల్లావ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కోసం అధికార యంత్రాంగం భారీ ర్యాలీలను నిర్వహించింది. మార్కాపురం పట్టణంలో చేపట్టిన ర్యాలీలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్బీవీ స్వామి, కలెక్టర్ అన్సారియా, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మార్కెట్ను సందర్శించి ప్లాస్టిక్ వాడవద్దని వ్యాపారులకు సూచించారు. ఒంగోలులో కార్పొరేషన్ కార్యాలయం నుంచి ట్రంకురోడ్డు మీదుగా అద్దంకి బస్టాండు సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ్కుమార్, జేసీ గోపాలకృష్ణ పాల్గొన్నారు. కనిగిరి పట్టణంలోని కొత్తూరు రోడ్డు మార్గంలో ఏళ్లతరబడి డ్రైనేజీ కాలువలో నిలిచిపోయిన మురుగును ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నేతృత్వంలో సిబ్బంది తొలగించారు. అలాగే పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దోర్నాలలో చేపట్టిన ర్యాలీలో టీడీపీ వైపాలెం ఇన్చార్జి ఎరిక్షన్బాబు పాల్గొన్నారు. పలు ఇతర పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా ర్యాలీలు, మానవహారాలు, ఇతర రూపాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధిద్దాం అంటూ ప్రతిజ్ఞలు చేశారు.