మార్కాపురం అభివృద్ధి ప్రజాప్రభుత్వంతోనే సాధ్యం
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:40 PM
మార్కాపురం సమగ్రాభివృద్ధి ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఎస్సీ, బీసీ కాలనీలో ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కృతజ్ఞతా సభ జరిగింది. స్థానిక 10, 11 వార్డులకు చెందిన ప్రజలు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఎమ్మెల్యే నారాయణరెడ్డి
మార్కాపురం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం సమగ్రాభివృద్ధి ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఎస్సీ, బీసీ కాలనీలో ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కృతజ్ఞతా సభ జరిగింది. స్థానిక 10, 11 వార్డులకు చెందిన ప్రజలు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ మార్కాపురం డివిజన్ ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచింది గత వైసీపీ ప్రభుత్వమన్నారు. ఎన్ని ఉద్యమాలు చేసినా మార్కాపురం జిల్లా ఇవ్వకుండా, వెలిగొండ పూర్తి చేయకుండా నమ్మి ఓట్టేసిన ప్రజల్ని నిలువునా మోసం చేశారన్నారు. ప్రస్తుతం వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీలపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ప్రజల్ని మోసం చేసేందుకే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు పూర్తి చేసినా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అవి నడుస్తాయన్నారు. 70 శాతం బెడ్లు పేదలకు ఉచితంగా ఇస్తారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపారన్నారు. ఆయనకు ఈ ప్రాంత ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. మార్కాపురంకు త్వరలో మిర్చి యార్డును తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పఠాన్ ఇబ్రహీంఖాన్, మేడిద రంగస్వామి, టీడీపీ నాయకులు పఠాన్ హుసేన్ఖాన్, సయ్యద్ గఫార్, మొఘల్ జాబిర్ హుసేన్బేగ్, దొడ్డా దుర్గే్షరెడ్డి తదితరులు పాల్గొన్నారు.