వ్యక్తి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:09 PM
కొండపి, మండలంలోని నెన్నూరుపాడు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త, పొగాకు రైతు చల్లా మధుసూదన్రెడ్డి (43) అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
కొండపిలోని టంగుటూరు రోడ్డులో మృతదేహం గుర్తింపు
కొండపి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని నెన్నూరుపాడు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త, పొగాకు రైతు చల్లా మధుసూదన్రెడ్డి (43) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కొండపిలోని టంగుటూరు రోడ్డులో ఆయన మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. మధుసూదన్రెడ్డి ఈనెల 4వ తేదీన కొండపిలో జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్నాడు.అప్పటి నుంచి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం టంగుటూరు రోడ్డులోని ఓ వెంచర్ వద్దకు వెళ్లిన కొందరు యువకులు అక్కడ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మధు కుటుంబ సభ్యులను పిలిపించగా వారు మృతదేహం ఆయనదేనని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నియమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు. వివాదాలకు దూరంగా ఉండే మధుకు శత్రువులు ఎవరూ లేరని గ్రామస్థులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల్లో ఒకరు ఇంజనీరింగ్ పూర్తిచేయగా, మరొకరు ఇంజనీరింగ్లో చేరాల్సి ఉందని గ్రామస్థులు చెప్పారు.