వైసీపీ నిరసనకు విద్యార్థులు
ABN , Publish Date - Sep 20 , 2025 | 02:33 AM
మార్కాపురం మండలం రాయవరం గ్రామ పరిధిలోని మెడికల్ కళాశాల వద్ద వైసీపీ శుక్రవారం నిర్వహించిన చలో మెడికల్ కళాశాల కార్యక్రమానికి కాలేజీ విద్యార్థులను తరలించారు. 30 యాక్ట్ అమలులో ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నా వైసీపీ నేతలు పట్టించుకోకుండా మెడికల్ కళాశాల ప్రాంగణంలోకి దూసుకెళ్లారు.
పోలీసుల ఆంక్షలు బేఖాతరు
మార్కాపురం రూరల్, సెప్టెంబరు 19 (ఆంధ్ర జ్యోతి) : మార్కాపురం మండలం రాయవరం గ్రామ పరిధిలోని మెడికల్ కళాశాల వద్ద వైసీపీ శుక్రవారం నిర్వహించిన చలో మెడికల్ కళాశాల కార్యక్రమానికి కాలేజీ విద్యార్థులను తరలించారు. 30 యాక్ట్ అమలులో ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నా వైసీపీ నేతలు పట్టించుకోకుండా మెడికల్ కళాశాల ప్రాంగణంలోకి దూసుకెళ్లారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కళాశాల నిర్మాణంలో జాప్యం జరిగినా తమకేమీ తెలియదన్నట్లుగా ఆందోళనకు నాయకత్వం వహించిన నేతలు మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి జనసమీకరణకు నాయకులు ప్రయత్నించి విఫలమయ్యారు. పోలీసులు వారిస్తున్నా పట్టించుకోకుండా కొందరు కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి నిర్మాణంలో ఉన్న కాలేజీ భవనంపైకి ఎక్కి వైసీపీ జెండాలను ఊపుతూ వాటిని అక్కడ కట్టారు. మెడికల్ కళాశాల నిర్మాణం ప్రభుత్వమే చేపట్టాలని, పీపీపీ పద్ధతిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అంది చడం కోసం మెడికల్ కళాశాలను మంజూరు చేశారని తెలిపారు. వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ పీపీపీ పేరుతో కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, కుందురు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు పాల్గొన్నారు.