పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:58 AM
భారీవర్షాలు కురుస్తుండటంతో జిల్లా లోని అన్ని గ్రామ పంచాయతీల్లో పారి శుధ్యంపై అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్ రాజాబాబు ఆదేశాలతో డీపీవో వెంకటేశ్వరరావు పంచాయతీ కార్యదర్శులు చేపట్టాల్సిన విధివిధానాలపై సర్క్యులర్ను జారీచేశారు.
పంచాయతీల్లో తాగునీరు కలుషితం కాకుండా చర్యలకు ఆదేశం
కలెక్టర్ సూచనలతో అధికారుల అప్రమత్తం
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 24 (ఆంధ్ర జ్యోతి): భారీవర్షాలు కురుస్తుండటంతో జిల్లా లోని అన్ని గ్రామ పంచాయతీల్లో పారి శుధ్యంపై అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్ రాజాబాబు ఆదేశాలతో డీపీవో వెంకటేశ్వరరావు పంచాయతీ కార్యదర్శులు చేపట్టాల్సిన విధివిధానాలపై సర్క్యులర్ను జారీచేశారు. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు బ్లీచింగ్ వంటివి చల్లే విధంగా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు ఉంటే తగిన చర్యలు తీసుకోవడంతోపాటు సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలను అక్కడికి తరలించాలన్నారు. అన్ని శాఖల ఉద్యోగులు, సిబ్బందిని సమన్వయం చేసుకొని పనిచేసే విధంగా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే వెంటనే బాధితులను ఆ పరిధిలోని పీహెచ్సీలకు, సీహెచ్సీలకు తరలించాలన్నారు. బ్లీచింగ్, సున్నం అందుబాటులో ఉంచుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆ సర్క్యులర్లో ఆదే శించారు. వరద ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం అందుబాటులో ఉన్న ట్యాంకర్లను గుర్తించి నీటిని అందించడంతోపాటు భారీ వర్షాలకు రోడ్లు, డ్రెయిన్లు, నీటి పారుదల నిర్మాణాలు దెబ్బతింటే యుద్ధప్రాతిపదికన ఆయా పనులు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీ కార్యదర్శి నిత్యం అందుబాటులో ఉంటూ సచివాలయ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులను సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయ పనులు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీల కార్యదర్శులు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవో లు, డీడీవోలు, డీఎల్పీవోలు తమ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో కలెక్టర్ జారీ చేసిన సూచనలకు అనుగుణంగా పారిశుధ్యం, తాగునీటి సరఫరా సక్రమంగా నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.