‘ఆమె’కు అనారోగ్యం
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:01 AM
నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు తమ కుటుంబాల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఈక్రమంలో తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడంతో అనేక సమస్యల్లో చిక్కుకుంటున్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, ఆ సమాజం ఆరోగ్యంగా ఉంటాయన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్వస్థ్నారీ సశక్తి పరివార్ అభియాన్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి.
40శాతం మంది మహిళలకు ఆరోగ్య సమస్యలు
స్వస్థ్నారీ వైద్యశిబిరాల్లో వెలుగులోకి వ్యాధులు
కేన్సర్, బీపీ, షుగర్ సమస్యలే అధికం
ఒంగోలు కార్పొరేషన్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు తమ కుటుంబాల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఈక్రమంలో తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడంతో అనేక సమస్యల్లో చిక్కుకుంటున్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, ఆ సమాజం ఆరోగ్యంగా ఉంటాయన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్వస్థ్నారీ సశక్తి పరివార్ అభియాన్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా గతనెల 17వ తేదీ నుంచి ఈనెల 2 వరకు ప్రభుత్వ వైద్యశాలలో ‘స్వస్థ్ నారీ సశక్తి పరివార్ అభియాన్’ శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రతి మహిళకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేశారు. 40 శాతం మంది మహిళలు కేన్సర్, రక్తపోటు, మధుమేహం రుగ్మతలతో ఉన్నట్లు గుర్తించారు.
634 క్యాంపులు.. 2,46,800 స్ర్కీనింగ్ పరీక్షలు
జిల్లాలో634 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి 2,46,800 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. 4,800 మందికి ఏఎంసీ పరీ క్షలు, 2,800 ఇమ్యునైజేషన్ సేవలు, 45 వేల మందికి హెచ్బీ, 70వేల మందికి హైపర్ టెన్షన్, షుగర్, 32వేల మందికి కేన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు చేశారు. వాటితోపాటు సిఫిల్ సెల్ స్ర్కీనింగ్3,200 మందికి నిర్వహించారు. పీఎంజేఏవై, ఏబీడీఎం కార్డులు 4వేల మందికి మంజూరు చేశారు. 35 మందికి మైనర్, 42 మందికి మేజర్ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. 85వేల మందికి టీబీ స్ర్కీనింగ్ చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 35 నుంచి 40శాతం వరకు డయాబెటిక్, 5శాతం మందికి హైపర్ టెన్షన్, 5శాతం టీబీ, 12శాతం రక్తహీనత, 10శాతం మంది కేన్సర్ బాధితులు ఉండగా, అందులోబ్రెస్ట్ కేన్సర్లే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఈ క్యాంపుల్లో పురుషులు కూడా పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకొన్నారు. మగవారిలో 10శాతం ఓరల్ కేన్సర్, సర్వైకల్ కేన్సర్ ఉన్నట్లు గుర్తించారు.