నేటి నుంచి రెండోదశ పొగాకు కొనుగోళ్లు
ABN , Publish Date - Mar 19 , 2025 | 01:26 AM
దక్షిణాదిలో రెండో దశ పొగాకు కొనుగోళ్లు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ప్రాంతంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 11 వేలం కేంద్రాలు ఉన్నాయి. అందులో ఈనెల 10న తొలి విడతగా ఒంగోలు-1, పొదిలి, కొండపి, కందుకూరు-1 కేంద్రాల్లో కొనుగోళ్లను బోర్డు అధికారులు చేపట్టారు.
ఏడు కేంద్రాల్లో ప్రారంభం
ఒంగోలు-2, వెల్లంపల్లిలో పాల్గొననున్న బోర్డు చైర్మన్
ఒంగోలు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాదిలో రెండో దశ పొగాకు కొనుగోళ్లు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ప్రాంతంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 11 వేలం కేంద్రాలు ఉన్నాయి. అందులో ఈనెల 10న తొలి విడతగా ఒంగోలు-1, పొదిలి, కొండపి, కందుకూరు-1 కేంద్రాల్లో కొనుగోళ్లను బోర్డు అధికారులు చేపట్టారు. గరిష్ఠ ధర కిలో రూ.280తో వేలం కొనసాగుతోంది. అయితే గ్రేడింగ్ సరిగా లేదంటూ కొన్ని బేళ్లను కంపెనీల ప్రతినిధులు తిరస్కరిస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో రెండో దశ పొగాకు కొనుగోళ్లు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లాలోని ఒంగోలు-2, వెల్లంపల్లి, టంగుటూరు, కనిగిరి, కందుకూరు-2, కలిగిరి డీసీపల్లి కేంద్రాల్లో బుధవారం ఉదయం వేలం ప్రక్రియ మొదలవుతుంది. పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్కుమార్ వెల్లంపల్లి, ఒంగోలు-2 కేంద్రాలలో వేలం ప్రక్రియను ప్రారంభించనున్నారు. మూడో విడతగా ఈనెల 24 నుంచి ఉత్తరాది వేలం కేంద్రాలుగా పిలిచే రాజమండ్రి రీజియన్లోని మిగిలిన ఐదు కేంద్రాల్లో వేలం ప్రారంభించనున్నారు.