ఉపాధ్యాయుల బిల్లులకు మోక్షం
ABN , Publish Date - Aug 12 , 2025 | 02:43 AM
రెండు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న టీచర్లకు ఉపశమనం కలగనుంది. జిల్లాలో 5,642 మంది బదిలీ టీచర్లకు గత రెండు నెలలుగా జీతాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పాఠశాలలకు విద్యాశాఖ కొత్త కేడర్ స్ట్రెంగ్త్ను ప్రకటించింది. ఆ మేరకు టీచర్లకు పొజిషన్ ఐడీలు కూడా రూపకల్పన చేసింది.
రేపటి వరకు సప్లిమెంటరీలకు అవకాశం
ఒంగోలు విద్య, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి) : రెండు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న టీచర్లకు ఉపశమనం కలగనుంది. జిల్లాలో 5,642 మంది బదిలీ టీచర్లకు గత రెండు నెలలుగా జీతాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పాఠశాలలకు విద్యాశాఖ కొత్త కేడర్ స్ట్రెంగ్త్ను ప్రకటించింది. ఆ మేరకు టీచర్లకు పొజిషన్ ఐడీలు కూడా రూపకల్పన చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన కొత్త కేడర్ స్ట్రెంగ్త్ ప్రకారం డీడీవోలు జీతాల బిల్లులు సిద్ధం చేశారు. డీడీవోలు లాగిన్లో గతంలో ఉన్న క్యాడర్ స్ట్రెంగ్త్ను డిలీట్ చేసి కొత్త దాని ప్రకారం టీచర్ల పొజిషన్ ఐడీలతో లాగిన్లోకి చేర్చుకోవాలి. గత రెండు నెలలుగా జీతాలు ఆగిపోవడంతో ముందుగా అరియర్ జీతాలు డ్రా చేస్తేనే తర్వాత ఈనెల జీతాలకు తాజాగా బిల్లులు సమర్పించేందుకు వీలులేదు. దీంతో డీడీవోలు ముందుగా రెండు నెలల జీతాలు డ్రా చేసేందుకు సప్లిమెంటరీ బిల్లులను సిద్ధం చేశారు. జిల్లాలోని ఖజానా కార్యాలయాల్లో సోమవారం డీడీవోలు సప్లిమెంటరీ జీతాల బిల్లులను సమర్పించారు. నిబంధనల ప్రకారం నెలలో 10వతేదీ లోపు సప్లిమెంటరీ బిల్లులు పెట్టాలి. అయితే ఈనెల 8 నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో ఖజానా శాఖ నిబంధనల ప్రకారం బిల్లుల సమర్పణకు ముందు రోజులు సెలవులు వస్తే ఆ తర్వాత ఆ రోజుకు అవకాశం ఇస్తారు. దీని ప్రకారం బిల్లుల సమర్పణ గడువుకు మూడు రోజులు సెలవులు రావడంతో ప్రస్తుతం ఆ మూడు రోజులు బిల్లుల సమర్పించేందుకు అవకాశం ఇచ్చారు. దీని ప్రకారం డీడీవోలు ఈనెల 13వరకు సప్లిమెంటరీ బిల్లులను పెట్టేందుకు ట్రెజరీశాఖ అధికారులు అంగీకరిస్తారు. లాగిన్ కూడా అందుబాటులో ఉంటుంది. సప్లిమెంటరీ బిల్లులు వచ్చినవి వచ్చినట్లు ఎస్టీవోలు మంజూరు చేస్తున్నారు. ఈనెల 15 నాటికి అరియర్ జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఆగస్టు నెల జీతాలకు రెగ్యులర్ బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది.