పార్వతీపురం చెరువుకు చేరిన సాగర్ జలాలు
ABN , Publish Date - Oct 19 , 2025 | 02:00 AM
మండలంలోని పార్వతీపురం చెరువుకు సాగర్ జలాలు చేరాయి. దీంతో గ్రామస్థులు జలహారతి ఇచ్చారు.
అద్దంకి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పార్వతీపురం చెరువుకు సాగర్ జలాలు చేరాయి. దీంతో గ్రామస్థులు జలహారతి ఇచ్చారు. మోదేపల్లి మేజర్ చివరి ఆయకట్టులోని కొటికలపూడి పంచాయతీ పరిధిలోని పార్వతీపురం చెరువుకు నీరు రావడం గగనంగా మారింది. ఈ నేపథ్యంలో కొటికలపూడి సర్పంచ్ పూనాటి విక్రమ్ రూ.లక్ష సొంత నిధులు వెచ్చించి 5 రోజులు గా ఎక్స్కవేటర్ ఏర్పాటు చేసి సాగర్ కాలువలలో జంగిల్ క్లియరెన్స్ చేయించారు. దీంతో శనివారం సాయంత్రానికి సాగర్ జలాలు పార్వతీపురం చెరువుకు చేరాయి. దీంతో పార్వతీపురం, వేణుగోపాల పురం గ్రామాలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. పశువుల నీటికి కూడా ఇబ్బందులు తొలగిపోను న్నాయి. సాగర్ జలాలు చెరువుకు చేరడంతో సర్పంచ్ పూనాటి విక్రమ్ ఆధ్వర్యంలో మహిళలు పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. సాగర్ జలాలు చెరువకు చేరడంతో పార్వతీపురం, కొటికలపూడి గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.