దర్శి బ్రాంచ్ కాలువకు చేరిన సాగర్ జలాలు
ABN , Publish Date - May 26 , 2025 | 11:00 PM
తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జలాలు సోమవారం దర్శి బ్రాంచ్ కాలువకు చేరాయి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు మంచినీటి చెరువులకు నీరు నింపేందుకు ప్రభుత్వం సాగర్ జలాలను విడుదల చేసింది.
దర్శి, మే 26(ఆంధ్రజ్యోతి) : తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జలాలు సోమవారం దర్శి బ్రాంచ్ కాలువకు చేరాయి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు మంచినీటి చెరువులకు నీరు నింపేందుకు ప్రభుత్వం సాగర్ జలాలను విడుదల చేసింది. సాగర్ డ్యాం నుంచి కుడి కాలువకు 5598 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా ఆ నీరు బుగ్గవాగుకు చేరుతోంది. బుగ్గవాగు నుంచి సాగర్ ప్రధాన కాలువకు 5100 క్యూసెక్కుల నీరు ప్రధాన కాలువకు విడుదల చేస్తున్నారు. జిల్లా సరిహద్దులోని 85/3 మైలుకు చేరే సరికి 1793 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. అక్కడ నుంచి దర్శి బ్రాంచ్ కాలువకు ప్రస్తుతం 803 క్యూసెక్కుల నీరు పంపిణీ అవుతోంది. ఒంగోలు బ్రాంచ్ కాలువకు మంగళవారం నీరు చేరుతోంది. ఈ సందర్భంగా డీఈ అక్బర్బాష మాట్లాడుతూ ప్రస్తుతం మంచినీటి చెరువులకు నీరు నింపేందుకు మాత్రమే నీరు విడుదల చేశామన్నారు. రైతులు తొందరపడి మేజర్లు ఎత్తవద్దని సూచించారు. ఎక్కడైనా ట్యాంపరింగ్కు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం విడుదల అవుతున్న నీటితో రామతీర్థం జలాశయంతో పాటు మంచినీటి చెరువులకు నీరు నింపుతామన్నారు.