బాధితులకు సొత్తు అందజేత
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:58 AM
నగదు, బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న బాధితులకు సాంకేతికత సాయంతో మార్కా పురం పోలీసులు 24 గంటల వ్యవధిలోనే కేసును పరిష్కరించి వారికి న్యాయం చేశారు.

మార్కాపురం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): నగదు, బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న బాధితులకు సాంకేతికత సాయంతో మార్కా పురం పోలీసులు 24 గంటల వ్యవధిలోనే కేసును పరిష్కరించి వారికి న్యాయం చేశారు. మార్కాపురం సీఐ పి.సుబ్బారావు కథనం మేరకు పెద్దదోర్నాల మండలం రామ చంద్రకోట గ్రామానికి చెందిన వెన్నా కాశిరెడ్డి, ధనలక్ష్మి దంపతులు బుఽధవారం మధ్యాహ్నం పట్టణానికి వచ్చారు. స్థానిక అరవింద స్కూల్ సమీపంలోని ధనలక్ష్మి అక్క కుమారి ఇంట్లో ఉన్నారు. అదేరోజు రాత్రి 7.45 గంటలకు కాశిరెడ్డి, ధనలక్ష్మి దంపతులు స్వగ్రామానికి మోటార్ సైకిల్పై తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో అరవింద స్కూల్ నుంచి విశ్వేశ్వర థియే టర్, రాథాకృష్ణ థియేటర్, తూర్పువీధి మీదుగా కమలా వెడ్డింగ్ మాల్ వద్దకు వెళ్లేసరికి వారి వెంట తెచ్చుకున్న నగదు, బంగారు ఆభరణాల సంచి పోయినట్లు గుర్తించి వెంటనే పట్టణ పోలీసలకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్నిచోట్ల బుధవారం రాత్రి వెదికారు. అయినా నగదు, ఆభరణాల జాడ దొరకలేదు. దీంతో పోలీసులు గురువారం ఉదయం వాగ్దేవి జూనియర్ కాలేజీ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. మోటా ర్ సైకిల్పై వెళ్తున్న కాశిరెడ్డి దంపతుల బ్యాగు కాలేజీకి సమీపంలోనే పడిపోయింది. అటుగా వెళ్తున్న తూర్పువీధికి చెందిన ఓ మహిళ ఆ బ్యాగును తీసుకుంది. పోలీసులు సదరు మహిళను గుర్తించి ఇంటికి వెళ్లి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అందులో వున్న నగదు, బంగారు ఆభరణాలను గురు వారం సాయంత్రం బాధితులు వెన్నా కాశిరెడ్డి దంపతులకు అందించారు. ఈ సందర్బంగా సీసీ కెమెరాల ద్వారా పోయిన సొత్తు దొరికేందుకు సాయపడిన వాగ్దేవి కాలేజీ అధినేత గొలమారి పవన్ను అభినందించారు. కార్యక్రమంలో టౌన్, రూరల్ ఎస్సైలు సైదుబాబు, అంకమ్మరావులు పాల్గొన్నారు.