342 సెల్ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:03 PM
మిస్ అయిన సెల్ఫోన్లను ఆధునిక సాంకేతిక విధానంతో గుర్తించి రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని ఎస్పీ వి.హర్షవర్ధనరాజు చెప్పారు.
బాధితులకు అప్పగించిన ఎస్పీ
ఫోన్ మిస్ అయితే 9121102266 వాట్సప్ నంబరుకు ఫిర్యాదు చేయండి
ఒంగోలు క్రైం, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి) : మిస్ అయిన సెల్ఫోన్లను ఆధునిక సాంకేతిక విధానంతో గుర్తించి రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని ఎస్పీ వి.హర్షవర్ధనరాజు చెప్పారు. స్థానిక పోలీసు కార్యాలయంలో గల గెలాక్సీ భవన్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ 2021 నవంబరు నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 9 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన సెల్ఫోన్లు(6,776) రికవరీ చేసి సంబంధిత యజమానులకు అందజేశామన్నారు. గత మూడు నెలల కాలంలో పోయిన 342 సెల్ఫోన్ల విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని చెప్పారు. సెల్ఫోన్ మిస్ అయిన వెంటనే సమీపంలో ఉన్న పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. అంతే కాకుండా వాట్సప్ నంబరు 9121102266 నంబరుకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ హర్షవర్ధన్రాజు కోరారు. సెకండ్ హ్యాండ్ సెల్ఫోన్లు కొనే సమయంలో తక్కువ ధరకు వస్తుందని దురాశకు వెళ్లవద్దని హితవు పలికారు. మిస్సింగ్ మొబైల్ ట్రేౖసింగ్కు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. రికవరీ చేసిన సెల్ఫోన్లను సంబంధిత యజమానులకు అందజేస్తామని చెప్పారు. మొబైల్ ఫోన్ మిస్ అయిన వెంటనే సిమ్కార్డు బ్లాక్ చేయించాలని సూచించారు. బ్యాంక్కు లింక్ అయిన ఫోను నంబరును మార్చుకోవాలని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఫోను ఇవ్వవద్దన్నారు. ఫోన్లు రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.