Share News

ప్లాట్లు సిద్ధం.. మౌలిక వసతులే తరువాయి

ABN , Publish Date - Sep 15 , 2025 | 01:38 AM

అద్దంకి పట్టణంలో అంతర్బాగంగా ఉన్న అద్దంకి మేజర్‌ కాలువకట్టను మినీ బైపాస్‌గా మార్చే పనులు ప్రారంభం కానున్నాయి.

ప్లాట్లు సిద్ధం.. మౌలిక వసతులే తరువాయి

అద్దంకి, సెప్టెంబరు 14 (ఆంద్రజ్యోతి): అద్దంకి పట్టణంలో అంతర్బాగంగా ఉన్న అద్దంకి మేజర్‌ కాలువకట్టను మినీ బైపాస్‌గా మార్చే పనులు ప్రారంభం కానున్నాయి. దీనికి ఆక్రమణల తొలగింపే ప్రధాన అడ్డంకి గా ఉంది. దీనిపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. కాలువ కట్టలు ఆక్రమించి సుమారు 100కు పైగా కుటుంబాలు నివాసం ఉంటుండగా వారిలో సుమారు 35 మందికి బొమ్మనం పాడురోడ్డులోని లే-అవుట్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. మిగిలిన 65 మందికి శింగర కొండపాలెం సమీపంలోని అద్దంకి కొండ వద్ద ఇళ్ల స్థలాల కేటాయింపునకు ప్లాట్లు సిద్ధం చేశారు. ఇళ్లస్థలాలు కేటాయించే ప్రాంతం లోతైన గోయ్యి కావటంతో మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ సహకారంతో లెవలింగ్‌ చేయించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మౌలిక వసతలు కల్పన ప్రారంభించారు. ఇప్పటికే రోడ్లు ఏర్పా టు పూర్తి కాగా, త్వరలో విద్యుత్‌ స్తంభాలు, బోర్ల ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు. కాలువ కట్టను రేణింగవరం రోడ్డులో కాకానిపాలెం నుంచి నామ్‌రోడ్దు వరకు మినీబైపాస్‌ రోడ్డు గా అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.15 కోట్ల అంచనాతో టెండర్ల దశకు చేరింది. త్వరలో మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ అద్దంకి పట్టణంలో పర్యటించనున్నారు. అదే రోజు మినీ బైపాస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అద్దంకి పట్టణంలో మూడు కమ్యూనిటీ భవనాలను కూడా మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ప్రారంభిస్తారని ఇటీవల విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రకటించారు.

Updated Date - Sep 15 , 2025 | 01:38 AM