విద్యాశాఖలో చిత్రవిచిత్రాలు
ABN , Publish Date - Jul 22 , 2025 | 01:04 AM
పాఠశాల విద్యాశాఖలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిఘా పెంచుతోంది. అందులో భాగంగా బడుల్లో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి పరిశీలకులు, సాక్షులు, నోడల్పర్సన్ల పేరుతో ఇతర అధికారులు, సిబ్బందిని నియమిస్తోంది.
క్లస్టర్ కాంప్లెక్స్లకు నోడల్ పర్సన్ల నియామకం
ఉపాధ్యాయులపై పెరిగిన నిఘా
హెచ్ఎంలపై కాంట్రాక్టు ఉద్యోగులకు పెత్తనం
ఒంగోలు విద్య, జూలై 21 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిఘా పెంచుతోంది. అందులో భాగంగా బడుల్లో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి పరిశీలకులు, సాక్షులు, నోడల్పర్సన్ల పేరుతో ఇతర అధికారులు, సిబ్బందిని నియమిస్తోంది. గత శనివారం నుంచి జరుగుతున్న క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలకు ప్రతి క్లస్టర్కు ఒక నోడల్ పర్సన్ను నియమించారు. క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలను క్లస్టర్ గెజిటెడ్ హెడ్మాస్టర్లు నిర్వహిస్తుండగా వారిపై అదేస్థాయి లేదా పైస్థాయి అధికారులను నోడల్ పర్సన్లుగా నియమించాల్సి ఉంది. అయితే కాంట్రాక్టు ఉద్యోగులను నియమించి హెచ్ఎంపై పెత్తనం అప్పగించారు. దీనిపై గజిటెడ్ హెచ్ఎంలు విస్తుపోతున్నారు. జిల్లాలో 150 క్లస్టర్ కాంప్లెక్స్లు ఉండగా ఈ సమావేశాలను మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించాలి.
నోడల్ పర్సన్ల నియామకం
క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల పర్యవేక్షణకు ప్రతి దానికి ఒక నోడల్ పర్సన్ను నియమించాలని ఎన్సీ ఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ సమావేశాలను విద్యాశాఖ తనిఖీ అధి కారులు సందర్శించి సూచనలు ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితికి చెల్లుచీటి ఇచ్చారు. ఇప్పుడు నియమిస్తున్న నోడల్ సర్సన్ మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం సమావేశం ముగిసేవరకు అక్కడే తిష్టవేసి కార్యక్రమాలను పరిశీలిస్తారు.
కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం
క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి ఒక అఫిషియల్ను నోడల్ పర్సన్గా నియమిం చాలని ఉత్తర్వులు జారీచేసినా జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారు. మండల విద్యావనరుల కేంద్రాల్లో పనిచేస్తున్న ఎంఐఎన్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మండల అకౌంటెంట్లకు ఆ బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేజీబీవీల్లో పనిచేస్తున్న వారిని నోడల్ పర్సన్లుగా నియమించమని ఎక్కడా లేనప్పటికీ వారిని కూడా నియమిస్తూ డీఈవో ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో 300 మంది గెజిటెడ్ హెచ్ఎంలు, 76మంది ఎంఈవోలు, డైట్ నుంచి 23 మంది అధ్యాపకులు, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు ఉన్నా కాంట్రాక్టు ఉద్యోగులను నియమించడం విమర్శలకు దారితీసింది.