Share News

రైతులకు నష్టపరిహారం చెల్లించండి

ABN , Publish Date - Apr 26 , 2025 | 11:07 PM

ఇటీవల కురిసిన అకాలవర్షాలు, ఈదురుగాలలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపునకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

రైతులకు నష్టపరిహారం చెల్లించండి
అధికారులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

అధికారులకు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి దిశానిర్దేశం

గిద్దలూరు టౌన్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల కురిసిన అకాలవర్షాలు, ఈదురుగాలలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపునకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు సమస్యలకు సంబంధించి ఆయా శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వ్యవసాయ, మండలాభివృద్ధి ఆర్‌డబ్ల్యూఎస్‌ నియోజకవర్గ అధికారులతో సమావేశమయ్యారు. అకాల వర్షాలు, ఈదురు గాలులతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సబ్సిడీపై అందించే వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, విత్తనాలను పంపిణీపై సూచనలు ఇచ్చారు. బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల మంజూరీలో నిర్ణీత సమయానికి ఇవ్వాలని, ఎస్సీ కార్పొరేషన్‌ లోన్లు కేటాయించిన యూనిట్లకు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. వేసవికాలం కావడం, రోజురోజుకు ఎండల తీవ్రత కారణంగా గ్రామాలలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించాలన్నారు. సమావేశంలో మండలాల ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్‌, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 11:07 PM