Share News

శిథిలావస్థలో పర్చూరు ఆర్‌టీసీ బస్టాండ్‌

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:05 AM

నిత్యం వందల మంది ప్రయాణికులతో రాకపోకలు సాగించే పర్చూరు అర్‌టీసీ బస్టాండ్‌ శిధిలావస్థకు చేరి ప్రమాద భరితంగా తయారైంది.

శిథిలావస్థలో పర్చూరు ఆర్‌టీసీ బస్టాండ్‌

నిరుపయోగంగా మరుగుదొడ్లు

పర్చూరు, జూన్‌ 2 (ఆంరఽధజ్యోతి) : నిత్యం వందల మంది ప్రయాణికులతో రాకపోకలు సాగించే పర్చూరు అర్‌టీసీ బస్టాండ్‌ శిధిలావస్థకు చేరి ప్రమాద భరితంగా తయారైంది. భవనం స్లాబ్‌లు పెచ్చులు ఊడిపడి ప్రయాణికులు గాయాలు పాలవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు.

నియోజకవర్గ కేంద్రమైన పర్చూరు వివిధ మండ లాలకు ప్రధాన కూడలిగా ఉంది. దీంతో చీరాల, చిలకలూరిపేట, నర్సరావుపేట, గుంటూరు, విజయ వాడ, హైదరాబాద్‌, ఇంకొల్లు తదితర మార్గాలకు వెళ్లే బస్సులు పర్చూరు ఆర్‌టీసీ బస్టాండ్‌ నుండే రాకపోకలు సాగించాల్సి ఉంది. దీంతో నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులతో ఆర్‌టీసీ బస్టాండ్‌ రద్దీగా ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న బస్టాండ్‌ శిథిలావస్థకు చేరుకొని ప్రమాదభరితంగా ఉన్నా అధికారులు కన్నెత్తి చూడకపోవటంపై ప్రయాణికులు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అడవిని తలపిస్తున్న ప్రాంగణం

ఆర్‌టీసీ బస్టాండ్‌ ప్రాంగణం చుట్టూ చిల్లచెట్లు, ముళ్లపొదలు పేరుకుపోయి అడవిని తలపిస్తోంది. దీనికి తోడు మందుబాబుల వీరంగం కూడా తోడు కావడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంటుందోనని ప్రయాణికులు భయపడుతు న్నారు. దీనికి తోడు విద్యుత్‌ సరఫరా కూడా అంతంతమాత్రంగానే ఉంది. దీంతో రాత్రి సమయా ల్లో ప్రయాణికులు అర్టీసీ బస్టాండ్‌కు రావాలంటేనే భయ పడాల్సిన పరిస్థితి నెలకొంది.

నిరుపయోగంగా మరుగుదొడ్లు

మరుగుదొడ్లు నిరుపయోగం గా మారి చిల్లచెట్లతో పేరుకు పోయి ఉన్నాయి. దీంతో అత్యవ సర పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడాల్సిన దుస్థితి నెలకొంది. వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

పెచ్చులూడి పడి ప్రమాదాలు

పర్చూరులో అర్‌టీసీ బస్టాండ్‌ నిర్మించి మూడు దశాబ్దాలు కావడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. దీనికి తోడు వర్షాకాలం కావడంతో భవనంపై స్లాబ్‌ పెచ్చులు ఊడిపడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి శిధిలావస్థకు చేరిన అర్‌టీసీ బస్టాండ్‌కు కనీస మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఆ దిశగా అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Jun 03 , 2025 | 12:05 AM