మూడు రోజుల్లో 40శాతానికి పైనే!
ABN , Publish Date - Jul 30 , 2025 | 01:32 AM
జిల్లాలో దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం ముందస్తుగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యానికి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు అనేక చర్యలను చేపట్టింది.
వృద్ధులు, దివ్యాంగులకు భారీగా బియ్యం పంపిణీ
కేకేమిట్ల మండలంలో అత్యధికంగా 60.82శాతం మందికి..
పెద్దారవీడులో అత్యల్పంగా 13.80శాతం మందికే !
ఒంగోలు కలెక్టరేట్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం ముందస్తుగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యానికి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు అనేక చర్యలను చేపట్టింది. అందులో భాగంగా ఇంటింటికీ రేషన్ పంపిణీ ప్రక్రియను తొలగించి ఆ స్థానంలో రేషన్ షాపుల వద్దనే కార్డుదారులకు సరుకుల పంపిణీని చేపట్టిన విషయం విదితమే. ఇంకోవైపు 65ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే రేషన్ అందిస్తోంది. జిల్లాలో 1,392 రేషన్ షాపుల పరిధిలో 78,806 మంది దివ్యాంగులు, వృద్ధులు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. అందుకు అనుగుణంగా ఆయా దుకాణాల పరిధిలోని వారికి ఈనెల 27 నుంచి సరుకులపంపిణీని ప్రారంభించింది. మూడు రోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 30,826 మందికి రేషన్ అందించారు. అంటే సుమారు 40శాతానికిపైగా వృద్ధులు, దివ్యాంగులు రేషన్ అందుకున్నారు. కొనకన మిట్ల మండలంలో 30 రేషన్ షాపుల పరిధిలో 1,950మంది ఉండగా 1,186 మందికి సరుకులు అందజేసి జిల్లాలో (60.82 శాతం) మొదటి స్థానంలో నిలిచారు. పెద్దారవీడు మండలంలో 23 రేషన్ షాపుల పరిధిలో 1,565 మంది ఉండగా కేవలం 216 మందికి మాత్రమే రేషన్ అందిజేసి చివరి స్థానంలో ఉన్నారు. మిగిలిన అన్ని మండలాల్లో 17శాతం నుంచి 38 శాతం వరకు బియ్యం పంపిణీ జరిగింది. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెప్తున్నారు.