అయ్యో పాపం!
ABN , Publish Date - Sep 24 , 2025 | 01:27 AM
నవమాసాలు మోసి కన్న బిడ్డ ఆ తల్లికి బరువైంది. శిశువుకు జన్మనిచ్చి అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఒక ప్రైవేటు నర్సింగ్ హోంకు సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిండు గర్భిణి వచ్చింది. డాక్టర్ లేకపోవడంతో మరుగుదొడ్డిలోకి వెళ్లి మగబిడ్డకు జన్మనిచ్చింది.
పుట్టిన బిడ్డను మరుగుదొడ్డిలో వదిలి వెళ్లిన తల్లి
శిశువు క్షేమం.. ఆమె కోసం గాలింపు
గిద్దలూరు టౌన్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : నవమాసాలు మోసి కన్న బిడ్డ ఆ తల్లికి బరువైంది. శిశువుకు జన్మనిచ్చి అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఒక ప్రైవేటు నర్సింగ్ హోంకు సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిండు గర్భిణి వచ్చింది. డాక్టర్ లేకపోవడంతో మరుగుదొడ్డిలోకి వెళ్లి మగబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడే పసికందును విడిచి వెళ్లిపోయింది. అయితే గర్భిణి వేరే ఆసుపత్రికి వెళ్లిందేమోనని సిబ్బంది అనుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున మరుగుదొడ్డి నుంచి బిడ్డ ఏడుపు వినిపిస్తుండటంతో సిబ్బంది అప్రమత్తమై వెళ్లిచూడగా మరుగుదొడ్డిలోని బకెట్లో మగబిడ్డ కనిపించాడు. వెంటనే చిన్నపిల్లల వైద్యుడు చికిత్స అందించడంతో బాబు క్షేమంగా ఉన్నాడు. సిబ్బంది సమాచారంతో సీఐ సురేష్ రంగంలోకి దిగి ఆ మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించడంతో శిశువు ఆరోగ్యం బాగుపడగానే ఒంగోలులోని ప్రభుత్వ శిశువిహార్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏదిఏమైనా నవమాసాలు మోసి కని ఇలా తల్లి వదిలి వెళ్లడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మేము పెంచుకుంటాం
ఒక ప్రైవేటు ఆసుపత్రిలోని మరుగుదొడ్డిలో మగశిశువు దిక్కూమొక్కూ లేకుండా ఉండడాన్ని తెలుసుకున్న మెకానిక్ షేక్ హాసీమ్, అతని భార్య రేష్మా స్పందించారు. వెంటనే సీఐ సురేష్ను ఈ దంపతులు కలిశారు. ఆ బిడ్డను తాము పెంచుకుంటామని ముందుకొచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిశువును ఒంగోలు శిశువిహార్కు తరలిస్తున్నామని, వారితో సంప్రదించి దత్తత తీసుకోవాలని సీఐ సూచించడంతో ఈ దంపతులు ఐసీడీఎస్ అధికారులను సంప్రదిస్తున్నారు.