మార్కాపురం మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:09 PM
ఎట్టకేలకు మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణారావు గద్దె దిగారు. ఆయనపై ప్రవేశపెట్టిన ఆవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపాలిటీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన అవిశ్వాస తీర్మాన సమావేశానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితోపాటు 23 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు.
ఖాళీ అయినా వైసీపీ చైర్మన్ పీఠం
ఎమ్మెల్యే కందులతోపాటు 23 మంది కౌన్సిలర్లు హాజరు
సమావేశంలో పాల్గొన్న ఏడుగురు వైసీపీ కౌన్సిలర్లు
మార్కాపురం, జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : ఎట్టకేలకు మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణారావు గద్దె దిగారు. ఆయనపై ప్రవేశపెట్టిన ఆవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపాలిటీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన అవిశ్వాస తీర్మాన సమావేశానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితోపాటు 23 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. పది మంది వైసీపీ, ఒక టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. డీఆర్వో ఓబులేసు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. ఉదయం 11 గంటలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినా కౌన్సిలర్లు ఎవరూ రాకపోవడంతో ప్రిసైడింగ్ అధికారి ఓబులేసు మధ్యాహ్నం 3.00 గంటలకు సమావేశం నిర్వహించారు. క్యాంపులో ఉన్న టీడీపీ కౌన్సిలర్లు 16 మంది ఎమ్మెల్యేతో కలిసి ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారంతా సమావేశ మందిరంలోకి వెళ్లగానే, మరో ఏడుగురు వైసీపీ కౌన్సిలర్లు కూడా కార్యాలయం వద్దకు చేరుకున్నారు. 2/3వ వంతు కౌన్సిలర్లు హాజరుకావడంతో ప్రిసైడింగ్ అధికారి అవిశ్వాస తీర్మాన ప్రక్రియను ప్రారంభించారు. తొలుత మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణారావు మీద పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులు ఎత్తాలని కోరారు. హాజరైన 23 మంది కౌన్సిలర్లలో 18 మంది, ఎక్స్అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కూడా చేతులు ఎత్తారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ప్రిసైడింగ్ అధికారి ఓబులేసు ప్రకటించారు. దీంతో చైర్మన్ చిర్లంచర్ల పదవీచ్యుతుడయ్యారు. ఈ మేరకు అవిశ్వాస తీర్మానంపై జరిగిన నివేదికను కలెక్టర్కు నివేదించనున్నట్లు పీవో ఓబులేసు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు పాల్గొన్నారు.
పటిష్ట పోలీసు బందోబస్తు
మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం సమావేశం నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. కార్యాలయ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. కార్యాలయంలోకి ఉద్యోగులు, సిబ్బందిని మినహా ఎవరినీ అనుమతించలేదు. కౌన్సిలర్లను కూడా తనిఖీ చేసి ఫోన్లు స్వాధీనం చేసుకుని లోపలికి పంపారు. పలువురు టీడీపీ, జనసేన పార్టీ నాయకులు సమావేశ మందిరం వద్దకు వెళ్లాలని ప్రయత్నించినా పోలీసులు సహకరించలేదు. సీఐ సుబ్బారావు పర్యవేక్షణలో టౌన్, రూరల్ ఎస్సైలు సైదుబాబు, అంకమ్మరావు సుమారు 50 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
వైసీపీ కౌన్సిలర్లు మద్దతుతో నెగ్గిన అవిశ్వాసం
మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉండగా, టీడీపీ బలం కేవలం ఐదుగురుమాత్రమే. కొన్నాళ్ల కిందట 12 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ల సంఖ్య 17కు చేరింది. మున్సిపాలిటీ అవినీతి, అక్రమాలకు నెలవుగా మారడం, అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుండడంతో ఎలాగైనా వైసీసీకి చెందిన చైర్మన్ చిర్లంచర్లను గద్దెదించాలని నిర్ణయించుకున్నారు. అవిశ్వాస తీర్మానానికి కొందరు వైసీపీ కౌన్సిలర్లు కూడా మద్దతు తెలుపుతామని చెప్పడంతో మార్గం సుగమమైంది. ముఖ్యంగా సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లకు కనీస మర్యాద ఇవ్వకపోవడం, చిన్నపాటి పనులకు కూడా పర్సంటేజీలు అడగడం, చివరికి బర్త్, డెత్ సర్టిఫికెట్లకు కూడా డబ్బులు డిమాండ్ చేస్తుండడాన్ని వైసీపీ కౌన్సిలర్లు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఈ నెల 11న అవిశ్వాసానికి సమావేశం నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు బుధవారం జరిగిన సమావేశంలో అవిశ్వాసం నెగ్గింది. చైరన్పీఠం ఖాళీ అయింది.