నేటి నుంచే కొత్త పాలన
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:35 AM
మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా, అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ పాలన బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. మార్కాపురం జిల్లా, అద్దంకితోపాటు కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశంలో కలిపేందుకు సోమవారం రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.
మార్కాపురానికి ఇన్చార్జులుగా ప్రకాశం కలెక్టర్, ఎస్పీ
తొలి వారంలోనే కొత్తవారు నియామకం
అద్దంకి డివిజన్కు ఇన్చార్జిగా ఒంగోలు ఆర్డీవో
కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు సిబ్బంది కేటాయింపు ప్రారంభం
వేగంగా పాలనాపరమైన పనులు
కొత్తగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా పాలనను అక్కడి నుంచే నడిపేందుకు రంగం సిద్ధమైంది. అలాగే అద్దంకి డివిజన్ పాలన కూడా అక్కడి నుంచే ప్రారంభం కానుంది. అందుకుగాను ప్రకాశం అధికారులకు ఇన్చార్జులుగా బాధ్యతలు అప్పగించారు. మార్కాపురంలో కలెక్టర్ కార్యాలయం, అద్దంకిలో ఆర్డీవో కార్యాలయాలు బుధవారం ప్రారంభించి పాలనకు శ్రీకారం పలకనున్నారు. వారంలోపే మార్కాపురం జిల్లాకు నూతన కలెక్టర్, ఎస్పీలతోపాటు ముఖ్యశాఖల అధికారులను కూడా నియమించేందుకు ఉన్నత స్థాయిలో కసరత్తు జరుగుతోంది.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా, అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ పాలన బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. మార్కాపురం జిల్లా, అద్దంకితోపాటు కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశంలో కలిపేందుకు సోమవారం రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. ఆ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. మార్కాపురం కేంద్రంగా బుధవారమే కలెక్టర్ కార్యాలయం ప్రారం భం కావాలని ఆదేశించింది. ఆ మేరకు మార్కాపురం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డులోని పునరావాస కాలనీలో రెండు ప్రభుత్వ పాఠశాలల భవనాలను కలెక్టర్ కార్యాలయానికి ఎంపిక చేశారు. ప్రస్తుత ప్రకాశం కలెక్టర్ రాజాబాబు ఆ జిల్లాకు ఇన్చార్జిగా బుధవారం అక్కడ బాధ్యతలు తీసుకొని పాలనను ప్రారంభిస్తారు. అక్కడ పనిచేసేందుకు కలెక్టరేట్లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందిని, ఆ ప్రాంతం లోనే పనిచేస్తున్న రెవెన్యూ శాఖలోని కొందరు సీని యర్ ఉద్యోగులను కేటాయించారు. అలాగే ప్రస్తుత ఎస్పీ హర్షవర్ధన్రాజు మార్కాపురర జిల్లాకు ఇన్చా ర్జిగా వ్యవహరించనున్నారు. పోలీసుశాఖ కార్యక్రమా లను అక్కడి నుంచే పర్యవేక్షించేందుకు ఇప్పటికే కొంతమంది సిబ్బందిని కేటాయించారు. వీలైనంత త్వరగా ఆ జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్, ఎస్పీలను నియమించేందుకు ఉన్నతస్థాయి అధికారులు కసరత్తు ప్రారభించారు. పరిపాలనాపరంగా ముఖ్యమైన శాఖలకు సంబంధించి ప్రస్తుత ప్రకాశం జిల్లా అధికారులే ఇన్చార్జులుగా బాధ్యతలు చేపట్టాలన్న ఆదేశాలు వారికి అందాయి.
అద్దంకి డివిజన్ నేటి నుంచే..
కొత్తగా ఏర్పాటైన అద్దంకి రెవెన్యూ డివిజన్ బుధవారం నుంచే ప్రారంభమవుతోంది. అద్దంకిలోని ఆర్అండ్బీ బంగ్లాలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒంగోలు ఆర్డీవో ప్రసన్నలక్ష్మిని ఇన్చార్జిగా నియమించారు. ఒంగోలు, చీరాల కార్యాలయాల నుంచి సిబ్బందిని బదిలీ చేశారు. అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లోని అన్ని మండలాలకు సంబంధించిన పాలన బుధవారం నుంచి అక్కడ ప్రారంభంకానుంది. కాగా కందుకూరు రెవెన్యూ డివిజన్ను కూడా ప్రకాశం జిల్లాలో కలిపినందున ఆ నియోజకవర్గంలోని ఐదు మండలాలతోపాటు కొండపి నియోజకవర్గంలోని పొన్నలూరు, మర్రిపూడి మండలాలను కలుపుకొని అక్కడ డివిజన్ కార్యక్ర మాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా కందుకూరు మొత్తం ఇక ప్రకాశం జిల్లా పరిధిలో చేరిపోయినట్లే.