నవ శింగరకొండ
ABN , Publish Date - May 08 , 2025 | 11:26 PM
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం 150 ఏళ్ల కాలంలో దినదిన ప్రవర్థమానమై అభివృద్ధి చెందింది.

పూర్తిగా మారిపోయిన అంజన్న ఆలయం
రూ.6.35 కోట్లతో రాతిముఖ మండపం నిర్మాణం
19న మహాకుంభాషేకం
దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి చెందిన క్షేత్రం
అద్దంకి, ఆంధ్రజ్యోతి :
అంజన్న వెలుగు చూసిందిలా...
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం 150 ఏళ్ల కాలంలో దినదిన ప్రవర్థమానమై అభివృద్ధి చెందింది. స్వామి పేరిట ఎలాంటి భూములు లేవు. కేవలం దాతలు, భక్తుల నుంచి వచ్చే కానుకలతో దేవాలయం అభివృద్ధి చేశారు.. చేస్తున్నారు. సుమారు 150 సంవత్సరాల క్రితం శింగరకొండ క్షేత్రాధిపతి అయిన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ జరిగే సమయంలో కొండ కింద చెట్ల మధ్యలో నుంచి వెలుగు కనిపించింది. భక్తులు వచ్చిచూడగా ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం ఉంది. అప్పటి నుంచి స్వామికి పూజలు చేయటం ప్రారంభించారు.
ఆలయ అభివృద్ధికి అంకురార్పణ ఇలా...
1916 నుంచి 1918 మధ్య కాలంలో భవనాసి చెరువు నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్ తనకు వచ్చిన లాభంలో కొంతభాగం వెచ్చించి దేవాలయ అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి చేరింది. అన్ని సామాజిక వర్గాలు అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. 70 ఏళ్ల నుంచి ఏటా ఫాల్గుణ శుద్ధత్రయోదశి నుంచి పౌర్ణమి వరకు 3 రోజులపాటు తిరునాళ్ల ఉత్సవాలు నిర్వహిస్తారు.
రూ.6.35 కోట్లతో రాతి ముఖమండపం నిర్మాణం
ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం రాతి ముఖమండపాన్ని సుమారు 6.35 కోట్ల రూపాయలు(2 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం, 2 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సీజీఎఫ్ నిధులకు తోడు దాతల వద్ద నుంచి 2.35 కోట్ల రూపాయలు) వెచ్చించి రాతి ముఖమండపాన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి ఒంగోలు రూరల్ మండలం కరవదికి చెందిన నలమలపు విజయభాస్కరరెడ్డి, శ్రీదేవి దంపతులు, అద్దంకికి చెందిన శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కోట శ్రీనివాసకుమార్, నాగలక్ష్మి దంపతులు, శింగరకాయకొండ మండలం చిన్నకనుమళ్లకు చెందిన గుంజి కృష్ణారావు, రమాదే వి, కాట్రగడ్డ అనిల్కుమార్, శ్రీవిద్య దంపతులు, తిరుపతి జిల్లా పుత్తూరు సమీపంలోని రాజుకండ్రిక వద్ద గల శ్రీరంగం మిల్క్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీనివాస మిల్క్ నిర్వాహకులు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేయగా, సుమారు 120 మంది భక్తులు లక్ష రూపాయల చొప్పున విరాళాలు అందజేశారు. ఇప్పటి వరకు విరాళాలు ఇచ్చిన దాతలతో పాటు ఈ నెల 19వ తేదీ వరకు విరాళాలు ఇచ్చే దాతల పేర్లు రాతి ముఖ మండపంపై ఏర్పాటు చేయనున్నట్లు ఈవో తిమ్మానాయుడు తెలిపారు.
మహాకుంభాభిషేకం ముహూర్తం ఇదే...
ఈ నెల 19వ తేదీ ఉదయం 9-03 గంటలకు శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామి ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం జరగనుంది. 14 నుంచి 19వ తేదీ వరకు 6 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమాలకు బాపట్ల జిల్లా, పొరుగున ఉన్న పల్నాడు, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలతోపాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
కొంగొత్తగా ఆలయ రూపురేఖలు
రాతిముఖ మండపం నిర్మాణం నిర్మాణంతో ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. దాతల సహకారంతో నాలుగువైపుల కొత్తగా రాజగోపురాలు, ఆలయ ప్రాకార మండపాలు, డార్మెటరీహాలు, గోశాల నిర్మాణం, కోనేరు నిర్మాణం, విజయగణపతిదేవాలయం, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, కల్యాణ మండపం నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని ఈవో చెప్పారు.