అధ్వానంగా ఎన్ఏపీ పైపులైన్లు
ABN , Publish Date - May 05 , 2025 | 10:36 PM
దర్శి ఎన్ఏపీ రక్షిత మంచినీటి పథకం రోజురోజుకు నిర్వీర్యం అవుతుంది. సుమారు 45 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎన్ఏపీ పైపులైన్లు తరచూ పగిలిపోతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒకచోట పైపులైన్ పగులుతుండటంతో మంచినీటి సరఫరాకు తీవ్ర అటంకం కల్గుతుంది.
తరచూ పగులుతున్న వైనం
తాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకం
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
దర్శి, మే 5(ఆంధ్రజ్యోతి): దర్శి ఎన్ఏపీ రక్షిత మంచినీటి పథకం రోజురోజుకు నిర్వీర్యం అవుతుంది. సుమారు 45 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎన్ఏపీ పైపులైన్లు తరచూ పగిలిపోతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒకచోట పైపులైన్ పగులుతుండటంతో మంచినీటి సరఫరాకు తీవ్ర అటంకం కల్గుతుంది. పగిలిన పైపులైన్లు గుర్తించి మరమ్మతులు చేసేందుకు అనేకనరోజుల సమయం పడుతుంది. ఈనేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు మంచినీరు అందక ఇబ్బందులు పడుతున్నారు.
దర్శి పట్టణంలో ప్రధాన పైపులైన్లు తరచూ పగులుతుండటంతో గ్రామాలకు కూడా మంచినీటి సరఫరా ఇబ్బందిగా మారింది. కొన్నిరోజుల క్రితం గడియార స్తంభం వద్ద మెయిన్ పైపులైన్ పగిలి అనేకరోజులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం దర్శి-పొదిలి రోడ్డులో దద్దాలమ్మ గుడి వద్ద పైపులైన్ మళ్లీ పడిలిపోయింది. దర్శి-కురిచేడు రోడ్లులో కూడా మెయిన్ పైపులైన్ పగిలిపొయింది. దీంతో దర్శి పట్టణంలోని అనేక ప్రాంతాలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది.
గత మూడు రోజులుగా సిబ్బంది అనేకచోట్ల తవ్వి చివరకు పగిలిన ప్రాంతాన్ని గుర్తించారు. సుమారు 47 సంవత్సరాల క్రితం నిర్మించిన పైపులైన్ కావటంతో సుమారు ఏడు అడుగుల లోతులో పైపు లైన్లు ఉన్నాయి. పగిలిన ప్రతిసారీ అక్కడ గుంతలు తీసి పగిలిన పైపులైన్లు గుర్తించేందుకు సిబ్బందికి ఇబ్బం దికరంగా మారింది. ఇదిలా ఉండగా పగిలిన పైపులైన్ మరమ్మతులను నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య పరిశీలించారు. పైపులైన్ మరమ్మతులను వీలైనంత త్వరగా పూర్తిచేసి ఆ ప్రాంతాలకు మంచినీరు సరఫరా చేయాలని సూచించారు. ఆయన వెంట ఏఈ హనుమాన్బాబు, సిబ్బంది ఉన్నారు.