జాతీయ అవార్డుకు ఎంపికైన మురుగుమ్మి
ABN , Publish Date - Nov 12 , 2025 | 01:26 AM
డ్వామా నీటి సంరక్షణ పథకంలో జాతీయ ఉత్తమ పురస్కారానికి కనిగిరి నియోజకవర్గ పరిధిలోని మురుగుమ్మి గ్రామ పంచాయతీ ఎంపికైంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో అక్కడి వాటర్ షెడ్, ఇతరశాఖల భాగస్వామ్యంతో ఉత్తమ నీటి యాజమాన్య విధానాలను పాటించారు.
పంచాయతీలో ఉత్తమంగా నీటి సంరక్షణ
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : డ్వామా నీటి సంరక్షణ పథకంలో జాతీయ ఉత్తమ పురస్కారానికి కనిగిరి నియోజకవర్గ పరిధిలోని మురుగుమ్మి గ్రామ పంచాయతీ ఎంపికైంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో అక్కడి వాటర్ షెడ్, ఇతరశాఖల భాగస్వామ్యంతో ఉత్తమ నీటి యాజమాన్య విధానాలను పాటించారు. పలురకాలైన సహజ పద్ధతుల్లో వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలమట్టం పెంపొందించడంలో విజయం సాధించారు. కందకాల పనులు, చిన్న, పెద్ద ఊటకుంటలు, పాండ్స్, అమృత్ సరోవర్లు, పూడికతీత పనులు చేయడం ద్వారా సుమారు 8.21 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేశారు. అందుకోసం 51 పనులకు రూ.97 లక్షలు వెచ్చించారు. ఆయా పనులను కేంద్ర బృందం ఇటీవల తనిఖీలు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి మత్రిత్వశాఖ, జలవనరుల శాఖ ఇచ్చే జాతీయ ఉత్తమ నీటి పురస్కార అవార్డుకు ఆ పంచాయతీని ఎంపిక చేశారు. ఈనెల 18న రాష్ట్రపతి చేతుల మీదుగా న్యూఢిల్లీలో ట్రోఫీ, ప్రశంసాపత్రం, రూ.1.5 లక్షల నగదు బహుమతిని అందుకోనున్నారు.