Share News

కందులను విమర్శించే అర్హత ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు లేదు

ABN , Publish Date - Dec 11 , 2025 | 09:40 PM

పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని విమర్శించే అర్హత యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు లేదని టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకులు అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్సీ సెల్‌ నాయకులు మాట్లాడారు.

కందులను విమర్శించే అర్హత ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు లేదు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకులు

మార్కాపురం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని విమర్శించే అర్హత యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు లేదని టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకులు అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్సీ సెల్‌ నాయకులు మాట్లాడారు. ఇతర ప్రాంతాల నుంచి పశ్చిమానికి వచ్చిన ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే కందుల గురించి ఏమి తెలుసునన్నారు. ఆయన గురించి విమర్శనాత్మకంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. గత వైసీపీ పాలనలో పశ్చిమ ప్రాంతానికి ఏం మేలు చేశారని ప్రశ్నించారు. జిల్లా ఇచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోలేదన్నారు. నాడు మార్కాపురం జిల్లా కోసం ఎమ్మెల్యే నారాయణరెడ్డి 65 రోజులపాటు రిలే దీక్షలు చేశారని, ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఆయన వెనక్కి తగ్గలేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ ఆయన పుణ్యం కాదా అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2007లో నారాయణరెడ్డి పశ్చిమం మొత్తం పాదయాత్ర చేయబట్టే రెండో టన్నెల్‌ మంజూరు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను బదిలీ చేసినట్లు నాయకులను బదిలీ చేయడంతో చంద్రశేఖర్‌ వైపాలెం వచ్చారన్న సంగతి గుర్తించుకోవాలన్నారు. ఈ ప్రాంతం గురించి కనీస అవగాహన లేకుండా టీడీపీ నాయకులపై అవాస్తవాలు మాట్లాడితే సహించేదిలేదన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ పులివేముల ఏసుదాసు, బూదాల జాన్‌డేవిడ్‌, నందం శేఖర్‌, పిల్లి సుబ్బు, మురికిపూడి రాజు, నాగార్జున, ఎనిబెర కిషోర్‌, బాబీ, వేశపోగు జాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 09:40 PM