Share News

బీట్‌గార్డ్‌పై ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆగ్రహం

ABN , Publish Date - Sep 15 , 2025 | 10:45 PM

అడవికి వెళ్లిన మహిళలపైనా, దేవాలయాలకు వెళ్లిన భక్తులపైనా అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని ప్రజలు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి దృష్టికి తీసుకురాగా అల్లినగరం బీట్‌ ఆధికారి లక్ష్మీనారాయణపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీట్‌గార్డ్‌పై ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆగ్రహం
బీట్‌గార్డ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

టోపీని నిర్లక్ష్యంగా విసిరేసిన అధికారి

అడవికి వెళ్లిన మహిళలపై అసభ్య దూషణ

క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని

సర్వసభ్య సమావేశంలో సభ్యుల తీర్మానం

కొమరోలు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : అడవికి వెళ్లిన మహిళలపైనా, దేవాలయాలకు వెళ్లిన భక్తులపైనా అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని ప్రజలు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి దృష్టికి తీసుకురాగా అల్లినగరం బీట్‌ ఆధికారి లక్ష్మీనారాయణపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావేశం ఎంపీపీ కామూరి అమూల్య ఆధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని కొమరోలు, అల్లినగరం ఫారెస్ట్‌ బీట్‌లో పనిచేస్తున్న బీట్‌గార్డు లక్ష్మీనారాయణ అడవికి బిక్కికాయలు, సీతాఫలాలు కోసుకుని ఊరురా తిరిగి ఆమ్ముకునే మహిళలపైనా, మండలంలోని మందలపాయ దేవాలయం, మాధవ దేవాలయాలకు వెళ్లే భక్తులను ఆసభ్య పదాలతో వేధిస్తున్నారని ఎమ్మెల్యే ఆశోక్‌రెడ్డికి చెప్పారు. సమావేశానికి వచ్చిన గార్డ్‌ లక్ష్మీనారాయణను ఎమ్మెల్యే ప్రశ్నించగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఎర్రచందనం దొంగలను పట్టుకోకుండా పేదలపై ప్రతాపం ఏంటని అశోక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గార్డ్‌ టోపీని విసిరేసి కూర్చోవడాన్ని గమనించిన ఎమ్మెల్యే మీకు క్రమశిక్షణ తెలియదా అంటూ మండిపడ్డారు. బీట్‌గార్డ్‌ తీరుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సభ్యులు తీర్మానం చేశారు. అతనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం జరిగిన చర్చలో కొమరోలు నుంచి రాజుపాలెం రోడ్డుకు కూ.4కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొమరోలు ప్రభుత్వ వైద్యశాలను సీహెచ్‌సీగా మార్పు చేసేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే అభివృద్ధి చెందుతుందని అన్నారు. మినీ స్టేడియం, బీసీ, కాపు భవనాలను త్వరలో పూర్తిచేస్తామన్నారు. కొమరోలు నుంచి హైదరాబాద్‌కు 8గంటలకు బయలుదేరేలా చూడాలని డిపో మేనేజర్‌కు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు ముత్తుముల సంజీవరెడ్డి, బిజ్జాం రవింద్రారెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ ఉపాధ్యక్షుడు గోడి ఓబుల్‌రెడ్డి, బిజ్జాల తిరుమలరెడ్డి, టీడీపీ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు, నాయకులు చలిచీమల శ్రీనివాసచౌదరి, పులకుర్తి వెంకటేశ్వర్లు, వీరంరెడ్డి కృష్ణమోహన్‌రెడ్డి, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 10:46 PM