భారీగా రేషన్ బియ్యం పట్టివేత
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:58 AM
మండల కేంద్రమైన మద్దిపాడులోని ఓ రైస్ మిల్లులో నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. మద్దిపాడులోని వెంకటేశ్వర రైస్మిల్లులో భారీగా బియ్యం నిల్వలు ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణకు ఫిర్యాదు అందింది.
మద్దిపాడులో 1,900 బస్తాలు, ఎన్జీపాడు వద్ద 300 బస్తాలు
ఒంగోలులోని ఎఫ్సీఐ గోడౌన్కు తరలింపు
రైస్మిల్లు లీజుదారుడిపై 6ఏ కేసు
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రమైన మద్దిపాడులోని ఓ రైస్ మిల్లులో నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. మద్దిపాడులోని వెంకటేశ్వర రైస్మిల్లులో భారీగా బియ్యం నిల్వలు ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణకు ఫిర్యాదు అందింది. దీంతో గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. భారీగా బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. రేషన్ బస్తాలతోపాటు మరికొంత భాగాన్ని పాలిష్ చేసి ప్యాకింగ్ మార్చినట్లు పసిగట్టారు. అక్కడ సుమారు 1,900 బస్తాల వరకు నిల్వ ఉన్నట్లు తేల్చారు. శుక్రవారం పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఆ మిల్లులో నిల్వ ఉన్న బియ్యాన్ని ప్రత్యేక లారీలు ఏర్పాటు చేసి ఒంగోలులోని ఎఫ్సీఐ గోడౌన్కు తరలించే ప్రక్రియను చేపట్టారు. మధ్యాహ్నం వరకు రెండు లారీల్లో వెయ్యి బస్తాలు, సాయంత్రం మరో లారీలో మిగతా బియ్యాన్ని తరలించారు. ఆ మిల్లు లీజుదారుడైన సురేష్పై 6ఏ కేసు నమోదు చేశారు. మరోవైపు చీరాల వైపు నుంచి లారీలో వస్తున్న బియ్యాన్ని నాగులుప్పలపాడు వద్ద పట్టుకున్నారు. ఆ లారీలో సుమారు 300 బస్తాల బియ్యం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రెండుచోట్ల కలిపి సుమారు 2,200 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకేరోజు రెండు ప్రాంతాల్లో పట్టుకున్న బియ్యాన్ని ఒంగోలులోని ఎఫ్సీఐ గోడౌన్కు తరలించారు.