ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో వెనుకంజ
ABN , Publish Date - Jun 08 , 2025 | 02:03 AM
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెం టరీ పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు వెనుకంజ వేశారు. మార్చిలో జరిగిన పబ్లిక్ పరీక్షా ఫలితాలతో పోల్చితే రాష్ట్రస్థాయిలో జిల్లాస్థానం మరింత దిగజారింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో కేవలం 37శాతం ఉత్తీర్ణతతో 24వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 57శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వస్థానంలో జిల్లా ఉంది.
ఫస్టియర్లో రాష్ట్రంలో జిల్లా 24వ స్థానం
ద్వితీయ సంవత్సరంలో 21వ స్థానం
ఒంగోలు విద్య, జూన్ 7 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెం టరీ పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు వెనుకంజ వేశారు. మార్చిలో జరిగిన పబ్లిక్ పరీక్షా ఫలితాలతో పోల్చితే రాష్ట్రస్థాయిలో జిల్లాస్థానం మరింత దిగజారింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో కేవలం 37శాతం ఉత్తీర్ణతతో 24వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 57శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వస్థానంలో జిల్లా ఉంది. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత కంటే ఆరుశాతం తక్కువతో విద్యార్థులు చతికిలబడ్డారు. జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 4,266 మంది హాజరు కాగా 2,433 మంది పాసయ్యారు. రాష్ట్రంలో సగటున 63శాతం మంది పాసుకాగా జిల్లాలో ఆరుశాతం తక్కువగా 57శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 567మంది పరీక్ష రాయగా 348మంది పాసయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి 700 మంది పరీక్షకు హాజరు కాగా 428 మంది అంటే 61.1శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కొండపి,. తాళ్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీ మోడల్ జూనియర్ కళాశాలల్లో 103 మందికి 67మంది అంటే 65శాతం పాసయ్యారు. దర్శి, ముండ్లమూరు మోడల్ జూనియర్ కళాశాలల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. హైస్కూలు ప్లస్లో 63మందికి 40మంది పాసయ్యారు. పాకల, హెచ్.నిడమానూరు, కె.ఉప్పలపాడు హైస్కూలు ప్లస్లో నూరుశాతం ఉత్తీర్ణులయ్యారు. కేజీబీవీలో 104మందికి 59 మంది పాసై 56.86శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీఎస్డబ్ల్యూఆర్/ఏపీటీడబ్ల్యూఆర్లో 36మందికి 19మంది పాసయ్యారు. కంభం, దూపాడులో వందశాతం ఉత్తీర్ణులయ్యారు. ఎయిడెడ్లో 31 మందికి 25మంది అంటే 81శాతం పాసయ్యారు. గిద్దలూరు ఎస్వీ జూనియర్ కళాశాలలో 95శాతం మంది పాసయ్యారు.
ప్రథమ సంవత్సరంలో..
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 5,999 మంది హాజరు కాగా కేవలం 2,248 మంది పాసయ్యారు. రాష్ట్రంలో సగటున 45శాతం మంది ఉత్తీర్ణులు కాగా జిల్లాలో 8శాతం తక్కువగా కేవలం 37శాతం మంది మాత్రమే పాసయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 369మందికి 173 మంది పాసు కాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 977 మందికి 412 మంది, ఏపీ మోడల్ జూనియర్ కళాశాలల్ల 138 మందికి 60మంది, హైస్కూలు ప్లస్లో 130 మందికి 42 మంది, కేజీబీవీల్లో 290 మందికి 156మంది, ఏపీఎస్డబ్ల్యూఆర్/ఏపీటీడబ్ల్యూఆర్లో 123 మందికి 54 మంది, ఎయిడెడ్లో 54 మందికి కేవలం 13మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ కళాశాలల్లో అతితక్కువగా కేవలం 24 శాతం మంది మాత్రమే పాసయ్యారు.