Share News

లారీ ఢీకొనడంతో కూలీ మృతి

ABN , Publish Date - May 09 , 2025 | 11:29 PM

చీరాల పట్టణ పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కూలీ మృతి చెందాడు.

లారీ ఢీకొనడంతో కూలీ మృతి
మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, కుమారులు(ఇన్‌సెట్లో) సురేష్‌(ఫైల్‌)

పొట్టకూటికి వెళుతూ అనంత లోకాలకు

విగతజీవిగా ఉన్న భర్తను చూసి కన్నీరుమున్నీరైన భార్య

చీరాల ఏరియా హాస్పిటల్‌ వద్ద మిన్నంటిన రోదనలు

చీరాల, మే 9 (ఆంధ్రజ్యోతి) : చీరాల పట్టణ పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కూలీ మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే... స్థానిక విఠల్‌నగర్‌కు చెందిన కుంచాల సురేష్‌(35), శ్రావణి దంపతులు. వీరికి ముగ్గురు కుమారులున్నారు. సురేష్‌ రోజువారీ కూలీతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన తన్నీరు సురే్‌షతో కలిసి కుంచాల సురేష్‌ ద్విచక్రవాహనంపై కఠారిపాలెంలో బేల్దారీ పని కోసం బయలుదేరారు. ఈక్రమంలో మన్నం అపార్ట్‌మెంట్‌ వద్దకు రాగానే జాతీయ రహదారిలో ట్రాఫిక్‌ ఉండటంతో బైక్‌ను నిదానం చేశారు. అదే సమయంలో చీరాల పట్టణంలో ఫ్యాన్సీ స్టోర్‌ లోడు దించి విజయవాడకు వెళుతున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న కుంచాల సురేష్‌ మాత్రమే తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స కోసం గుంటూరుకు సిఫార్సు చేశారు. బంధువులు అంబులెన్స్‌లో ఎక్కిస్తుండగానే తుదిశ్వాస విడిచాడు. సమాచారం అందుకున్న రెండవ పట్టణ పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు.


సాయంత్రం ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్తానని చెప్పి...

పనికి వెళ్లి పెందల కడనే వస్తా.. ఎగ్జిబిషన్‌కు వెళదామని కుంచాల సురేష్‌ ఉదయాన్నే చెప్పి పనికి వెళ్లాడు. అలా వెళ్లిన గంట తరువాత చీరాల ఏరియా వైద్యశాలలో శవమై కనిపించాడు. లోకం తెలియని ముగ్గురు పసి కందులు తల్లి శ్రావణిని హత్తుకుని బోరున విలపించారు. ‘ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్తానంటివే లే నాన్న’ అని పిల్లలు రోదించడం అందర్నీకలచివేసింది. వారిలో ఒక బాబు హాస్పిటల్‌ గ్రిల్స్‌ పట్టుకుని రోదిస్తుంటే వదిలించడం పెద్దల తరం కాలేదు.

Updated Date - May 09 , 2025 | 11:29 PM