కంభం పంచాయతీ.. కంపు కంపు
ABN , Publish Date - Mar 14 , 2025 | 01:00 AM
కంభం మేజర్ పంచాయతీలోని పలు వీధులు కంపుకొడుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటే ముక్కు మూసు కోవలసిందే.

కంభం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కంభం మేజర్ పంచాయతీలోని పలు వీధులు కంపుకొడుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటే ముక్కు మూసు కోవలసిందే. మరికొన్ని చోట్ల మురుగునీరు రోడ్లపైనే ప్రవ హిస్తోంది. కంభం మేజర్ పంచాయతీలోని సంగ, తెలుగు, గాంధీబజార్, ఆర్టీసీ బస్టాండ్, విక్టరీ హాలు వెనుక వైపు ఉన్న ఇరిగేషన్ కాలువలు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ సమీపంలో ఆంజనేయస్వామి దేవాలయం వెనుక వైపు ఉన్న కాలువ, బోర్డు స్కూలు పక్కన ఉన్న కాలువల్లో నెలల తరబడి చెత్త పేరుకుపోయి మురికినీటి నిలువతో భయంకరమైన కంపు కొడుతోంది. దీనికితోడు మూడు నెలల క్రితం ఇరిగేషన్ అధికారులు కాలువల శుభ్రం పేరుతో వ్యర్థాలన్నింటిని తీసి గట్లపై పడవేసి ఇప్పటికీ తీయకపోవడంతో కంపు మరింత ఎక్కువైంది. రోడ్ల వెంబడి వెళ్లే పాదాచారులు, వాహనదారులు ముక్కు లు మూసుకుని వెళ్ళాల్సి వస్తోంది. సాయంత్రం 6 గంటలకు అయిందంటే మురుగు కాలువల్లోని దోమల దెబ్బకు ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ, ఇరిగేషన్ అధికారులు స్పందించి కాలువలను శుభ్రం చేయడమేకాక చెత్తను ఎత్తివేసి కంపునుంచి, దోమల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.