ఈ ప్రాంతాన్ని కలుషితం చేయడానికే వచ్చిన జగన్
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:10 PM
ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతాన్ని కలుషితం చేయడానికే జగన్ పొదిలి పర్యటనకు వచ్చారని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రాజధాని మహిళా రైతులపై జగన్రెడ్డి సొంత మీడియా సాక్షిలో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన అసభ్య వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం మహిళలు పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు.
ఆయన పొదిలి పర్యటనలో చోటుచేసుకున్న ఘటనలపై ఎమ్మెల్యే కందుల ధ్వజం
కొనకనమిట్ల, జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతాన్ని కలుషితం చేయడానికే జగన్ పొదిలి పర్యటనకు వచ్చారని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రాజధాని మహిళా రైతులపై జగన్రెడ్డి సొంత మీడియా సాక్షిలో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన అసభ్య వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం మహిళలు పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. వారికి సంఘీభావంగా ఎమ్మెల్యే కందుల పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది రైతులు పొగాకుకు ఇచ్చిన లక్ష్యానికి మించి పండించారన్నారు. అంతర్జాతీయ మార్కెట్ దృష్ట్యా కొంత ధరలు తగ్గిన మాట వాస్తవమేనని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పొదిలి పొగాకు బోర్డుకు వెళ్లి కంపెనీ యాజమాన్యాలతో మాట్లాడి కొనుగోలులో వేగం పెంచినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అంతా సవ్యంగా జరుగుతుండగా ఇప్పుడు జగన్రెడ్డి వచ్చి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అన్నివర్గాల రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కందుల స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని గుర్తు చేశారు. నాడు రైతులను పట్టించుకోని జగన్ నేడు కపటప్రేమ చూపుతున్నారని కందుల ధ్వజమెత్తారు. అమరావతి మహిళలను కించపరిచిన వారిపై, ఆ చానల్పై చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ నాయకులు రాళ్లు రువ్వడం అమానుషమన్నారు. ఈ నిరసన ర్యాలీ కొనకనమిట్ల బస్టాండ్ సెంటర్ నుంచి పోలీ్సస్టేషన్ వరకు సాగింది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.