నాపై సీఐడీ విచారణ చేయించాలి
ABN , Publish Date - May 09 , 2025 | 11:33 PM
చీరాల పురపాలక సంఘం పరిధిలో అభివృద్ధికే గానీ అవినీతికి చోటులేకుండా పాలన సాగించానని, కొంతమంది కావాలనే తనపై అవినీతి ఆరోపణలు చేసి అవిశ్వాసం పెట్టారని వెంటనే తనపై సీఐడీ, సీబీసీఐడీ, విజిలెన్స్ అధికారులు విచారణ చేయాలని మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు కోరారు.

గతంలోనే నేను చీరాల అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలోకి
రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత ఎన్నికల్లో వైసీపీకు మద్దతు
తిరిగి టీడీపీ అధిష్టానం కోరిక మేరకే పార్టీ తీర్థం
ఆమంచిపై పలు ఆరోపణలు
విలేకరుల సమావేశంలో మునిసిపల్ చైర్మన్ జంజనం
చీరాల, మే 9 (ఆంధ్రజ్యోతి) : చీరాల పురపాలక సంఘం పరిధిలో అభివృద్ధికే గానీ అవినీతికి చోటులేకుండా పాలన సాగించానని, కొంతమంది కావాలనే తనపై అవినీతి ఆరోపణలు చేసి అవిశ్వాసం పెట్టారని వెంటనే తనపై సీఐడీ, సీబీసీఐడీ, విజిలెన్స్ అధికారులు విచారణ చేయాలని మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం చైర్మన్ చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలోనే ఆమంచి సాగించిన ఘోరాలను కరపత్రాల ద్వారా ప్రచారం చేసినట్లు గుర్తు చేశారు. అందుకు సంబంధించిన కరపత్రాలను సైతం ప్రదర్శించారు. మరొక వైపు కరణం బలరామకృష్ణమూర్తి చీరాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలుమార్లు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోనివ్వకుండా ఆమంచి కవ్వింపులకు పాల్పడినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బలరాంకు మద్దతు తెలిపామని, తనపై కక్ష బూని చైర్మన్ పదవి నుంచి తొలగించేందుకు ఆమంచి ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపించారు. అవిశ్వాసం అధిష్టానం ఆదేశమని, ఎమ్మెల్యే కొండయ్యతో సానుకూలంగా, వివాదాలు లేకుండా ప్రయాణం చేస్తానని జంజనం చెప్పారు. గతంలోనే తాను టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. సహచర కౌన్సిలర్లతో భేదాభిప్రాయాలు లేవన్నారు. చీరాల్లో టీడీపీకు ఆమంచి కృష్ణమోహన్ తీరని ద్రోహం చేశారని, టీడీపీ తీర్థం పుచ్చుకునే ఆ పార్టీని నిర్వీర్యం చేశారని జంజనం ఆరోపించారు.