ఎన్టీఆర్ భరోసాతో ప్రతి ఇంటిలో ఆనందం
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:19 AM
ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్తో ప్రతి ఇల్లు సంతోషంగా ఉండాలన్నదే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు ఎంపీ మాగుంట శ్రీనివాసరావు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం నగరంలోని 33వ డివిజన్లోని కొత్తడొంకలో పర్యటించి అర్హులైన లబ్ధిదారులకు నేరుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.
- ఒంగోలులో 20,403 మంది లబ్ధిదారులకు రూ. 8.94 కోట్లు పంపిణీ
ఒంగోలు కార్పొరేషన్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్తో ప్రతి ఇల్లు సంతోషంగా ఉండాలన్నదే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు ఎంపీ మాగుంట శ్రీనివాసరావు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం నగరంలోని 33వ డివిజన్లోని కొత్తడొంకలో పర్యటించి అర్హులైన లబ్ధిదారులకు నేరుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చారన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ సూపర్ సిక్స్లో భాగంగా తొలి హామీలో భాగంగా పింఛన్లు పెంచామన్నారు. పేదవారికి ఆరోగ్యంపరంగా, కుటుంబ అవసరాలకు పింఛన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తామన్నారు. త్వరలోనే ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం లభిస్తుందని తెలిపారు. అలాగే రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. అలాగే నగర సుందరీకరణ కోసం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాలుగు వేల మొక్కలు నాటుతామని, అందులో విద్యార్థులను భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఒకరోజులోనే నూరు శాతం పింఛన్లు పంపిణీ చేశామని తెలిపారు. కమిషనరు కే.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో 20,403 మంది లబ్ధిదారులకు వృద్ధాప్య, వితంతు, ఒంటరి, దివ్యాంగుల, ట్రాన్స్జండర్ పింఛన్లు రూ.8,94,72,500 అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మాగుంట, దామచర్ల కొత్తడొంకలోని ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశుధ్యం సమస్యను వారి దృష్టికి తీసుకురాగా సంబంధిత శానిటరీ అధికారులను పిలిపించి తక్షణమే పారిశుధ్యం మెరుగుపరచాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అలాగే విద్యుత్ స్తంభాల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు బండారు మదన్, మేడికొండ మోహన్రావు, నల్లూరి రవి, గంగవరపు కృష్ణమోహన్రావు, కట్టా లక్ష్మీదేవి, బెల్లం సత్యం తదితరులు పాల్గొన్నారు.