అంతర్ జిల్లా బదిలీలకు గ్రీన్సిగ్నల్
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:09 AM
ఉపాధ్యాయులు, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారుల అంతర్ జిల్లాల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇతర జిల్లాల నుంచి వివిధ కేడర్ల టీచర్లు 34మంది ఇక్కడకు బదిలీ మీద రాగా, ఇక్కడి నుంచి 36 మంది ఇతర జిల్లాలకు వెళ్తున్నారు.
ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
34 మంది టీచర్లు ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు
36 మంది ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు స్థానచలనం
ఒంగోలు విద్య, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారుల అంతర్ జిల్లాల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇతర జిల్లాల నుంచి వివిధ కేడర్ల టీచర్లు 34మంది ఇక్కడకు బదిలీ మీద రాగా, ఇక్కడి నుంచి 36 మంది ఇతర జిల్లాలకు వెళ్తున్నారు. బదిలీ అయిన టీచర్లను డీఈవో కిరణ్కుమార్ గురువారమే రిలీవ్ చేశారు. ఇక్కడకు బదిలీపై వస్తున్న వారు శుక్ర వారం నుంచే ఇక్కడి డీఈవో కార్యాలయంలో రిపోర్టు చేస్తున్నారు. టీచర్ల అంతర్ జిల్లా బదిలీలను పరస్పర (మ్యూచువల్), భార్యాభర్తలు(స్పౌజ్)కు మాత్రమే పరిమితం చేశారు. జిల్లా నుంచి 44 మంది అంతర్ జిల్లాల బదిలీలకు దరఖాస్తు చేయగా వీరిలో 22 మంది స్పౌజ్, 22మంది పరస్పర బదిలీలు కోరుకున్నారు. స్పౌజ్ కేటగిరీ కింద బదిలీ కోసం దరఖాస్తు చేసిన 22 మందిలో 15 మందికి ఇతర జిల్లాలకు బదిలీ ఉత్తర్వులు రాగా ఏడుగురి దరఖాస్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. 13 మంది టీచర్లు ఈ కేటగిరీ కింద ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు బదిలీ అయ్యారు. పరస్పర బదిలీ కోసం దరఖాస్తు చేసిన 22 మందిలో 21 మందికి స్థానచలనం కల్పించారు. అంటే 21మంది ఇక్కడ నుంచి ఇతర జిల్లాలకు బదిలీ కాగా 21మంది ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు వస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వస్తున్న వారిలో స్పౌజ్ కేటగిరీ కింద పీఎస్హెచ్ఎం, స్కూలు అసిస్టెంట్ హిందీ, గణితం, సోషల్, తెలుగు-2, వ్యాయామ విద్య 4, ఎస్జీటీలు ముగ్గురు ఉన్నారు. పరస్పర బదిలీల్లో స్కూలు అసిస్టెంట్ హిందీ 2, గణితం ఒకరు, పీఎస్ ఒకరు, తెలుగు 2, సెకండరీ గ్రేడ్ తెలుగు 11, ఉర్దూ ఒకరు ఇక్కడకు వచ్చారు. గతంలో పరస్పర బదిలీ కింద ఇక్కడకు వచ్చే వారిని మ్యూచువల్ ఇచ్చిన టీచర్ల స్థానంలోనే నియమించేవారు. ప్రస్తుతం ఆ పద్ధతికి ప్రభుత్వం చెల్లుచీటీ ఇచ్చింది. కేటగిరి 3, 4 ప్రాంతాల్లోని పాఠశాలల్లో అత్యవసరమైన వాటిలో వీరిని నియమించనున్నారు. ఇక్కడకు బదిలీపైనా వచ్చిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి నియమించనున్నారు. ఆ కేడర్ సీనియారిటీ జాబితాలో వీరిని చివరి స్థానంలో ఉంచుతారు.