విద్యుత్ ప్రమాద బాధితులకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Dec 02 , 2025 | 10:39 PM
విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు చెప్పారు.
ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు మంజూరుకు హామీ
వై.పాలెం టీడీపీ ఇన్చార్జి ఎరిక్షన్బాబు
త్రిపురాంతకం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు చెప్పారు. సోమవారం అన్నసముద్రం గ్రామంలో క్రిస్మస్ స్టార్ ఏర్పాటు సందర్భంగా జరిగిన విద్యుత్ షాక్ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆయన గ్రామానికి వెళ్లి మృతులు పచ్చిగొర్ల విజయ్, వీర్నపాటి దేవయ్యలకు నివాళి అర్పించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి భరోసా ఇచ్చారు. వారితో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో ఫోన్లో మాట్లాడించారు. ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం గాయపడిన పిచ్చయ్య, యోహాను, దావీదులను ఎరిక్షన్బాబు పరామర్శించారు. గాయపడిన వారి చికిత్స కోసం తనవంతుగా 40వేల రూపాయల నగదును అందజేశారు. ఆయనతోపాటు తహసీల్దార్ కృష్ణమోహన్, విద్యుత్శాఖ ఈఈ నాగేశ్వరరావు, మండల టీడీపీ కన్వీనర్ మేకల వలరాజుయాదవ్, ఎన్నెస్పీ వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ దేవినేని చలమయ్య, పార్టీ నాయకులు లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.