ఇంటికి గ్రహదోషం పూజ పేరుతో మోసం
ABN , Publish Date - May 01 , 2025 | 11:04 PM
బ్రహ్మంగారి స్వామి దీక్ష డ్రస్లు ధరించి ఇరువురు వ్యక్తులు చందాల కోసం వచ్చి భార్యాభర్తలకు మత్తు మందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు.
తీర్థంలో మత్తుమందు ఇచ్చి దోపిడీ.. దీక్షధారుల వేషంలో వచ్చి బురిడీ
ఒంగోలు క్రైం, మే 1(ఆంధ్రజ్యోతి) : బ్రహ్మంగారి స్వామి దీక్ష డ్రస్లు ధరించి ఇరువురు వ్యక్తులు చందాల కోసం వచ్చి భార్యాభర్తలకు మత్తు మందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానిక చైతన్యనగర్లో గురువారం మధ్యాహ్నం జరిగింది. కూలి చేసుకొనే భూమిరెడ్డి గురుస్వామిరెడ్డి అతని భార్యప్రసన్న ఇంటిలో ఉండగా ఇరువురు వ్యక్తులు మోపెడ్పై కాషాయి వస్త్రాలు ధరించి వచ్చారు. భోజనాలకు చందాల పేరుతో ఆ ప్రాంతమంతా తిరిగి గురుస్వామి రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ గురుస్వామిరెడ్డి భార్య రూ.100 ఇచ్చారు. మీ ఇంటికి గ్రహదోషం ఉంది పూజ చేయాలని నమ్మబలికారు. అందుకు రూ.30 వేలు ఖర్చవుతుందన్నారు. గురుస్వామి రెడ్డి రూ.20 వేలు ఇస్తానని చెప్పి పూజ చేయించాడు. ఆ సమయంలో ఆయన భార్య చెవి కమ్మలు, చేతి ఉంగరం పూజలో ఉంచాలని చెప్పి దేవుడు పటం ముందు పెట్టించారు. పూజ చేసే సమయంలో భార్య భర్తలకు తీర్థం ఇచ్చారు. ఆది తాగిన తరువాత కొద్ది సేపటికి ఇరువురు మత్తులోకి వెళ్లారు. ఆ తర్వాత వారు ఆమె మెడలో ఉన్న బంగారం గొలుసు, ఉంగరం, చెవికమ్మలుతోపాటు రూ.20 వేలు నగదు తీసుకొని పరారయ్యారు. భార్యాభర్తలు మత్తునుంచి తేరుకొని తాము మోసపోయామని తెలుసుకొని తాలూకా పోలీసు లకు ఫిర్యాదు చేఉశారు. పోలీసులు వారి ఇంటి దగ్గరలో ఉన్న సీసీ ఫటేజిని పరిశీలించార. వారు ప్రయాణించిన వాహనాన్ని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.