త్వరలో విద్యార్థులకు ముఖ హాజరు
ABN , Publish Date - Aug 17 , 2025 | 02:37 AM
ప్రభుత్వ రంగ పాఠశాలల్లో విద్యార్థులకు కూడా ముఖ హాజరు అమలులోకి రానుంది. ఈమేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ యాప్లో విద్యార్థుల ముఖహాజరు ఎలా వేయాలో తెలియజేస్తూ ఒక నోట్ రావ డంతో ఇది ఖాయమన్న నిర్ధారణకు ఉపాధ్యాయులు వస్తున్నారు.
పాఠశాలల్లో అక్రమాలకు చెక్
ఉపాధ్యాయులపై పెరుగుతున్న భారం
ఒంగోలు విద్య, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ పాఠశాలల్లో విద్యార్థులకు కూడా ముఖ హాజరు అమలులోకి రానుంది. ఈమేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ యాప్లో విద్యార్థుల ముఖహాజరు ఎలా వేయాలో తెలియజేస్తూ ఒక నోట్ రావ డంతో ఇది ఖాయమన్న నిర్ధారణకు ఉపాధ్యాయులు వస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయుల ముఖహాజరు అమలులో ఉంది. సరైన సమయంలో హాజరు నమోదు కాక టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరికీ ముఖహాజరు నమోదు చేయాలంటే ఎంత సమయం పడుతుందోనని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. పనిభారం కూడా పెరుగుతుందని వాపోతున్నారు.
విద్యార్థుల ముఖహాజరు నమోదు ఇలా
పాఠశాలల్లో లీప్ యాప్లో విద్యార్థుల ముఖహాజరు ఎలా నమోదు చేయాలో సోదాహరణంగా వివరించారు. యాప్లో ముందుగా స్టూడెంట్ ఆప్షన్లో యాక్షన్లోకి వచ్చిన తర్వాత సింక్రనైజీ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయాలి. అప్పుడు వ్యక్తిగత లాగిన్/ స్కూలు లాగిన్/హెచ్ఎం లాగిన్తో సహా అన్ని లాగిన్లలో విద్యార్థి డేటా కనిపిస్తుంది. యాక్షన్లోకి వెళ్లి దాని మీద క్లిక్ చేస్తే అందరికీ ఈ ఆప్షన్ చూపిస్తుంది. ముందుగా టీచర్ ఆప్షన్లో టీచర్ సర్వీసెస్లోకి వచ్చిన తర్వాత సింక్రనైజ్డ్ బటన్పై ఒకసారి క్లిక్ చేస్తే విద్యార్థి ఫేషియల్ డేటా ప్రత్యక్షమవుతుంది. దాని ప్రకారం విద్యార్థుల ముఖహాజరు నమోదు చేయాల్సి ఉంటుంది.
అక్రమాలకు చెక్ పెట్టేందుకే
పాఠశాలల్లో ప్రభుత్వ పథకాల అమలులో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు విద్యార్థుల ముఖహాజరును ప్రవేశపెట్టారు. విద్యార్థులకు అందజేస్తున్న విద్యార్థి మిత్ర కిట్, తాజాగా అందజేసిన అసెస్మెంట్ బుక్లెట్లు, మధ్యాహ్న భోజనం దుర్వినియోగం కాకుండా ముఖహాజరు విధానం దోహదం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అసెస్మెంట్ బుక్లెట్ల ద్వారా విద్యార్థుల బోగస్ హాజరును గుర్తించేందుకు విద్యాశాఖ అధికారులు సోమవారం నుంచి పాఠశాలలు తనిఖీలకు శ్రీకారం చుట్టనున్నారు.