ఇంటర్నల్ స్క్వాడ్ అధికారుల విస్తృత తనీఖీలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:34 PM
పెద్దదోర్నాల మండలంలోని ఎరువుల దుకాణాలను ఇంటర్నల్ స్క్వాడ్ అధికారులు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. రిజిస్టర్లోవి, నిల్వ ఉంచిన ఎరువుల్లో వ్యత్యాసం ఉన్న రూ.9,20.778 విలువైన ఎరువుల అమ్మకాలను నిలిపివేశారు.
రూ.9,20,778 విలువైన ఎరువుల అమ్మకాలు నిలుపుదల
పెద్దదోర్నాల, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఎరువుల దుకాణాలను ఇంటర్నల్ స్క్వాడ్ అధికారులు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. రిజిస్టర్లోవి, నిల్వ ఉంచిన ఎరువుల్లో వ్యత్యాసం ఉన్న రూ.9,20.778 విలువైన ఎరువుల అమ్మకాలను నిలిపివేశారు. ఇంటర్నల్ స్క్వాడ్ అధికారి కే రాజశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సోదాల్లో గురుసాయి ట్రేడర్స్లో రూ.6,65,050 విలువైన 22,400 మెట్రిక్ టన్నుల ఎరువులు, శ్రీశ్రీనివాస ట్రేడర్స్లో రూ.93,150 విలువైన 8,100 మెట్రిక్ టన్నులు, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ దుకాణంలో రూ.1,62,578 విలువైన 8,450 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంఆర్పీ ధరలకు మాత్రమే ఎరువులు అమ్మకాలు చేయాలని, రశీదులు విధిగా రైతులకు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఏవోలు జవహర్లాల్నాయక్, విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు.
6,210 టన్నుల ఎరువుల సీజ్
పెద్దారవీడు : వ్యవసాయ అధికారుల తనిఖీ బృందం గురువారం మండలంలోని కుంటలోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ మేరకు కంపెనీ అనుమతి పత్రాలు లేని 6210 టన్నుల ఎరువుల విక్రయాలను నిలిపివేశారు. కనిగిరి ఏడీఏ నేతృత్వంలో అంతర్గత తనిఖీ బృందం ఈ మేరకు మండలంలోని మూడు ఎరువుల షాపులలో తనిఖీలు నిర్వహించారు. కంపెనీ అనుమతి పత్రాలు లేకుండా ఎరువుల విక్రయాలు చేయరాదన్నారు. షాపులలో నిర్వహించే క్రయవిక్రయాలను ఈ-పోస్ మిషన్లో కచ్చితంగా నమోదు చేయాలన్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని అధిక ధరలకు విక్రయించినట్లయితే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏవో ఎన్. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.