ఉత్సాహంగా..
ABN , Publish Date - Jul 05 , 2025 | 10:56 PM
సుపరిపాలనకు ఏడాది’ పేరుతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమం నాల్గవ రోజైన శనివారం కూడా ఉత్సాహంగా సాగింది. ప్రజాప్రతినిధులు, ఇన్చార్జిలు, ఇతర ముఖ్యనాయకులు తమ పరిధిలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పలుచోట్ల స్థానిక నేతలు ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

‘సుపరి పాలనకు ఏడాది’ కార్యక్రమం
ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్న టీడీపీ శ్రేణులు
పలుచోట్ల ముఖ్యనేతలు హాజరు
గిద్దలూరులో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే ముత్తుముల
ఒంగోలు జూలై 5 (ఆంధ్రజ్యోతి): ‘సుపరిపాలనకు ఏడాది’ పేరుతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమం నాల్గవ రోజైన శనివారం కూడా ఉత్సాహంగా సాగింది. ప్రజాప్రతినిధులు, ఇన్చార్జిలు, ఇతర ముఖ్యనాయకులు తమ పరిధిలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పలుచోట్ల స్థానిక నేతలు ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంలో రాష్ట్రప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి పనుల పరిశీలనతోపాటు కొన్నిచోట్ల సమస్యలను పరిశీలిస్తున్నారు. గిద్దలూరు పట్టణంలోని 16వ వార్డులో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి ఇంటింటికీ తిరిగి సుపరిపాలనకు ఏడాది కార్యక్రమం నిర్వహించారు. ఆ వార్డులో రూ.39 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పట్టణంలోని 29వవార్డులో ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలను కలుస్తున్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి వెలిగండ్లలోని దళితవాడలో కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నగరంలోని 50వ డివిజన్లో, అలాగే రెండో డివిజన్లో ఇంటింటికీ తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ చీమకుర్తి మండలం చండ్రపాడులో, వైపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గుడూరి ఎరిక్షన్బాబు దోర్నాలలో, దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారవు దర్శి మండలం కొత్తపల్లిలో సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు.