అనుమానాలు కాదు.. ఆధారాలే ముఖ్యం
ABN , Publish Date - May 17 , 2025 | 12:48 AM
‘ప్రజల అనుమానాలు, అపోహల కన్నా దర్యాప్తులో వెల్లడైన నిజాలు, లభించిన ఆధారాలే ముఖ్యం. తదనుగుణంగానే టీడీపీ నేత ముప్పవరపు వీరయ్యచౌదరి కేసులో ముందుకెళ్తున్నాం. ఈ కేసులో ముప్పా సురేష్ పాత్ర కీలకం. హంతకుల్లో నాగరాజు పాత్ర కూడా ఎక్కువే. వారిని వదలం. ముఖ్యంగా సురేష్ వెనకున్న వారిని వదిలే ప్రసక్తే లేదు. కుట్రదారులు, హంతకులను అరెస్ట్ చేయడమే కాదు. వారికి శిక్షపడే విధంగా కేసును ముందుకు తీసుకువెళ్లడం మా లక్ష్యం’ అని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు.
ముప్పా సురేష్ కీలక కుట్రదారుడే
అతడిని, అతని వెనుక ఉన్న వారినీ వదలం
సిఫారసులు లేవు, ఒత్తిళ్లు అంతకన్నా లేవు
అరెస్టులే కాదు.. వారికి శిక్షపడే విధంగా చేస్తాం
వీరయ్య హత్య కేసు దర్యాప్తుపై ఎస్పీ దామోదర్
‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో పలు అనుమానాలపై స్పష్టత
(ఒంగోలు, ఆంధ్రజ్యోతి)
‘ప్రజల అనుమానాలు, అపోహల కన్నా దర్యాప్తులో వెల్లడైన నిజాలు, లభించిన ఆధారాలే ముఖ్యం. తదనుగుణంగానే టీడీపీ నేత ముప్పవరపు వీరయ్యచౌదరి కేసులో ముందుకెళ్తున్నాం. ఈ కేసులో ముప్పా సురేష్ పాత్ర కీలకం. హంతకుల్లో నాగరాజు పాత్ర కూడా ఎక్కువే. వారిని వదలం. ముఖ్యంగా సురేష్ వెనకున్న వారిని వదిలే ప్రసక్తే లేదు. కుట్రదారులు, హంతకులను అరెస్ట్ చేయడమే కాదు. వారికి శిక్షపడే విధంగా కేసును ముందుకు తీసుకువెళ్లడం మా లక్ష్యం’ అని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. టీడీపీ నేత వీరయ్యచౌదరి హత్య కేసులో కొందరిని అరెస్ట్ చేశామని, మరికొందరి కోసం గాలిస్తున్నామని ఇటీవల ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దర్యాప్తుపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శనివారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఎస్పీ దామోదర్ స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు.
నిష్పక్షపాతంగా దర్యాప్తు
వీరయ్య చౌదరి హత్య కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగిందని ఎస్పీ చెప్పారు. నిత్యం డీజీపీ పర్యవేక్షించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడు కూడా దర్యాప్తునకు అనుగుణంగానే ముందుకు సాగాలని చెప్పారని ఒక ప్రశ్నకు బదులుగా ఎస్పీ స్పష్టం చేశారు. నిందితులు ఎవరనేది మాకు ముఖ్యం కాదు.. వారు ఏ పార్టీ అనేది అనవసరం. ఆ తరహాలోనే దర్యాప్తు చేశామని వెల్లడించారు. అనుమానితులుగా గుర్తించి ఇప్పటికే చాలామందిని విచారించామన్నారు. దర్యాప్తులో వెల్లడైన విషయాలకు అనుగుణంగా ఆ కేసులో అనుమానం ఉన్న వారినే నిందితులుగా తీసుకున్నామని తెలిపారు. మరో ప్రశ్నకు బదులుగా ఏ దశలోనూ రాజకీయ దురుద్దేశంతో ముందుకు పొమ్మని మాకు సిఫారసు చేసిన వారు గానీ, బలవంతం చేసిన వారుగానీ లేరన్నారు. ఈ విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా ముందుకు సాగారనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు.
కుట్రలో సురేష్ పాత్ర కీలకమే
‘అమ్మనబ్రోలు గ్రామానికి చెంది హైదరాబాద్లో ఉంటున్న ముప్పా సురేష్ కూడా వీరయ్య హత్యకేసులో ప్రధాన కుట్రదారుడే. అందుకు తగిన ఆధారాలు మావద్ద ఉన్నాయి. అతన్నే కాదు. అతనికి అండగా ఉన్నవారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదు’ అరి ఎస్పీ స్పష్టం చేశారు. ఈ విషయంలో వెల్లడైన కొన్ని అనుమానాలను ఆంధ్రజ్యోతి వ్యక్తంచేయగా అవి అనుమానాలే. మేము నిజాలకు అనుగుణంగా ముందుకుపోతున్నాం. ఆయన ఎవరు, ఏపార్టీ, ఏస్థాయి వారు, ఎవరు మద్దతు ఉందనేది మాకు అనవసరమని చెప్పారు. మరొక ప్రశ్నకు బదులుగా ముప్పా సురేష్ దేశంలోనే ఉన్నారు. మాకు దొరకాల్సిందే. ఒంగోలు జైలుకు వెళ్లాల్సిందేనని ఎస్పీ కరాఖండిగా చెప్పారు. ఆయన్ని తప్పించాలని ఒత్తిడి మీకు వచ్చింది కదా.. ఫోన్లో మీడియాకు అందుబాటులో ఉన్న వ్యక్తి మీకు ఎలా దొరకకుండా ఉన్నారని ప్రజలు అనుమానిస్తున్నారని ప్రశ్నించగా.. ‘అనుమానాలు, అపోహలు వేరు. కుట్రదారుల్లో అతని పాత్ర ఉందని మేము గుర్తించాం. ఆధారాలు సేకరించాం. తదనుగుణంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఖాయం. అలాగే దర్యాప్తు ఇంతటితో పూర్తికాలేదు. సురేష్ వెనుక ఎవరున్నారన్న అంశంపై కూడా విచారిస్తున్నాం. కచ్ఛితంగా కూపీ లాగుతాం. ఎవరు ఉన్నా వదిలే ప్రసక్తే లేదు’ అని ఎస్పీ వెల్లడించారు. ఇంకో ప్రశ్నకు బదులుగా అతను ఏ రాజకీయ పార్టీ అనేది మాకు ముఖ్యం కాదు. కానీ మీరన్నట్లు ప్రధానంగా వైసీపీ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఉదంతాలు మా దృష్టికి వచ్చాయని ఎస్పీ చెప్పారు. ఇంకో ప్రశ్నకు బదులుగా ఇంకా మాకు దొరకని వారిలో నాగరాజు అనే నిందితుడు హంతకులలో ఒకరు. హతుడు వీరయ్యను ఒక పక్క నుంచి వంశీ కత్తితో పొవడగా, రెండో పక్క నుంచి నాగరాజు కూడా పొడిచాడు. నాగరాజును తప్పకుండా పట్టుకొస్తాం. జైలుకు పంపుతామన్నారు. ఇప్పుడేదో అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. తుది విచారణలో కుట్రదారులకు, హంతకులకు శిక్షపడే విధంగా సేకరించిన ఆధారాలతో ప్రాఽథమిక దర్యాప్తు గానీ, ఛార్జీషీటును కానీ రూపొందిస్తున్నామని ఎస్పీ చెప్పారు. మా లక్ష్యం అరెస్టు చేయడం కాదు. కోర్టులో అందరికి శిక్షపడటమేనని స్పష్టం చేశారు.
ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు
రౌడీ మూకలు, గంజాయి, ఇతర డ్రగ్స్ విక్రయించే, వినియోగించే వారిని నివారించడమే లక్ష్యంగా ప్రత్యేక యాంటీ గూండా స్క్వాడ్ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఆ స్క్వాడ్ ఇప్పటికే చాలామందిని అదుపులోకి తీసుకుందని, వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. జిల్లాలో రౌడీమూకలు. గంజాయి ఇతర డ్రగ్స్ వినియోగదారులు లేకుండా చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.