సబ్సిడీతో విద్యుత్ అందించాలి
ABN , Publish Date - Jul 22 , 2025 | 01:02 AM
జిల్లాలో ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్ను సరఫరా చేయాలని రొయ్యల రైతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈదర యశ్వంత్కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. రొయ్యల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆక్వా రైతులు పలు రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఆక్వా రైతుల సంక్షేమ సంఘం డిమాండ్
ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఒంగోలు కలెక్టరేట్, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్ను సరఫరా చేయాలని రొయ్యల రైతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈదర యశ్వంత్కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. రొయ్యల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆక్వా రైతులు పలు రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీటిని ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. యూనిట్ రూ.1.50కే సబ్సిడీపై విద్యుత్ను ఆక్వా/నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా అన్ని చెరువులకు సరఫరా చేయాలన్నారు. 2019కి ముందు ఇచ్చిన విధంగానే ట్రాన్స్ ఫార్మర్లను రైతులకు ఉచితంగా అందించడంతోపాటు కిలో ఆక్వా ఫీడ్ను రూ.9కే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా తర్వాత పెరిగిన ఆక్వా కెమికల్స్ ధరలను తగ్గించడంతోపాటు హేచరీలను పర్యవేక్షిస్తూ నాణ్యమైన రొయ్యల లార్వాను అందించాలన్నారు. జిల్లాలో గత 30ఏళ్లుగా రొయ్యల సాగు చేసుకుం టున్న రైతుల భూములకు శాశ్వ త హక్కుల కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ హక్కులు లేకపోవడంతో రైతులు సీఏఏ, ఏపీఎస్ఎడీఏ లైసెన్సులు పొందలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దాని వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ సబ్సిడీ, ఇతర రాయితీలను ఆక్వా రైతులు అందుకోలేకపోతున్నారని వాపోయారు. అందువల్ల ప్రభుత్వం స్పందించి ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. అనంతరం కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు మార్నేని వెంకటేశ్వర్లు, కిలారి రవికుమార్, ఏడుగుండ్ల కృష్ణమూర్తి, బి.హరి, కూరపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.