విద్యకు అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:56 PM
బాలికల విద్యకు, రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
సీఎస్పురం(పామూరు), ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): బాలికల విద్యకు, రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు. సీఎస్పురం మండలం శీలంవారిపల్లి గ్రామంలోని కదిరి వెంకటనరసయ్య, లక్ష్మమ్మ జిల్లా పరిషత్ ప్లస్ కళాశాల ఆవరణలో నిర్మించిన కేజీబీవీ టైప్- 4 బాలికల వసతి గృహం భవనాలను విశ్రాంత జాయింట్ కలెక్టర్ కలెక్టర్ పిడుగు బాబురావుతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ప్రత్యేక నిధులతో నిర్మించిన ఈ భవనాలను వైసీపీ పాలకులు ప్రారంభించకుండా బాలికల విద్యను విస్మరించారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బాలికలు అంకితభావంతో విద్యను అభ్యసించి విద్యలో ఉన్నత స్ధానానికి చేరుకోని తల్లిదండ్రుల కలలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అలాగే, సీఎస్పురంలోని కేజీబీవీలో ఇంటర్ విద్యార్థుల కోసం నిర్మించిన అదనపు తరగతి గదులను జీసీడీవో కె.హెమలతతో కలిసి డాక్టర్ ఉగ్ర ప్రారంభించారు. కార్యక్రమాల్లో సర్పంచ్ శ్రీరాం పద్మావతి, ఉపసర్పంచ్ పి.నరసయ్య, ఎంపీడీవో ఎల్.బ్రహ్మయ్య, ఎంఈవోలు కె.ప్రసాదరావు, రాజాల కొండారెడ్డి, ఎస్ఎస్ఏ ఏఈ ప్రకాష్రావు, టీడీపీ మండల అధ్యక్షుడు బి.వెంగయ్య, జిల్లా షీప్ సొసైటీ అధ్యక్షుడు టి.గోపి, సింగిల్ విండో అధ్యక్షుడు సీహెచ్ వెంకట్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.