రోడ్ల మరమ్మతులను పర్యవేక్షణ చేయరా..
ABN , Publish Date - May 09 , 2025 | 11:32 PM
రోడ్ల మరమ్మతుల సమయంలో అధికారుల పర్యవేక్షణ లేకుండా పనులు ఎలా చేస్తారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆర్అండ్బీ డీఈ నరసింహారావుపై ఫోన్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాగున్న మార్జిన్లను చెడగొడుతుంటే ఏమి చేస్తున్నారంటూ ఆర్అండ్బీ డీఈపై ఫోన్లో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి రవికుమార్
రూ.50 కోట్లతో రోడ్ల అభివృద్ధి
అద్దంకి నియోజకవర్గంలో పలు రహదారులకు మోక్షం
అద్దంకి, మే 9 (ఆంధ్రజ్యోతి) : రోడ్ల మరమ్మతుల సమయంలో అధికారుల పర్యవేక్షణ లేకుండా పనులు ఎలా చేస్తారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆర్అండ్బీ డీఈ నరసింహారావుపై ఫోన్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని గోవాడకు వచ్చిన మంత్రి రవికుమార్ దృష్టికి శింగరకొండపాలెం-అంబడిపూడి ఆర్అండ్బీ రోడ్డు మరమ్మతులను ఆయన పరిశీలించారు. ఆ సమయంలో గ్రామస్థులు మాట్లాడుతూ మార్జిన్లు గతంలో పటిష్టంగా ఉండగా, ప్రస్తుతం ఎక్స్కవేటర్తో తవ్వటంతో బలహీనంగా మారుతున్నాయని, వర్షాకాలం కోతకు గురవుతాయని చెప్పటంతో మంత్రి వెంటనే ఆర్అండ్బీ అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్లో డీఈ పొంతన లేకుండా సమాధానం చెప్పటంపైనా అసహనం వ్యక్తం చేశారు. రోడ్ల పనులు జరిగే సమయంలో కచ్చితంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా చూడాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో దమ్ముచక్రాల ట్రాక్టర్లు తారురోడ్లపై తిరగకుండా ఆయా గ్రామాల ప్రజలే బాధ్యత తీసుకోవాలన్నారు. అనంతరం నామ్ రోడ్డు నుంచి గోవాడ వరకు సుమారు 1.20 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎ్స నిధులతో జరుగుతున్న తారురోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అద్దంకి నియోజకవర్గంలో మొత్తం 50 కోట్ల రూపాయలతో తారురోడ్ల నిర్మాణ పనులు వివిధ దశలలో ఉన్నాయన్నారు. ఇప్పటికే 14.56 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎ్స నిధులతో 11 రోడ్లు, 9.85 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో శాంతినగర్-ఏలేశ్వరవారిపాలెం, కొప్పెరపాడు-జమ్మలమడక రోడ్లకు నిధులు మంజూరయ్యాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి 14 పనులకు సంబంధించి 23.85 కోట్ల రూపాయలు త్వరలో నిధులు మంజూరు కానున్నాయన్నారు. నియోజకవర్గంలోని అన్ని రోడ్లను వచ్చే నాలుగేళ్లలో తారురోడ్లుగా మార్చనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఐయూ డీఈ రమే్షబాబు పాల్గొన్నారు.