ఒంగోలులో ఆగస్టు 20 నుంచి సీపీఐ రాష్ట్రమహాసభలు
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:07 PM
ఒంగోలులో ఆగస్టు 20నుంచి 24వ తేదీ వరకు సీపీఐ రాష్ట్ర 28వ మహాసభలు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ చెప్పారు.
పార్టీ శతజయంతి సందర్భంగా కార్యక్రమానికి ప్రాముఖ్యత
రాష్ట్రనాయకత్వాన్ని అందించడంలో చరిత్ర కలిగిన ప్రకాశం
సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులో ఆగస్టు 20నుంచి 24వ తేదీ వరకు సీపీఐ రాష్ట్ర 28వ మహాసభలు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ చెప్పారు. స్థానిక మల్లయ్యలింగం భవన్లో సీపీఐ రాష్ట్ర మహాసభల ఆహ్వాన కమిటీసమావేశం ఆదివారం జరిగింది. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ శతజయంతి సందర్భంగా ఒంగోలులో జరిగే సీపీఐ రాష్ట్ర మహాసభలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు. రాష్ట్రానికి అత్యధిక నాయకత్వాన్ని అందించిన జిల్లా ప్రకాశం అని కొనియాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు, మాజీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, అఖిల భారత కిసాన్సభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకయ్య, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావులు తదితరులు ప్రకాశం జిల్లావారేనని చెప్పారు. 92 వసంతాల నల్లూరి వెంకటేశ్వర్లు నాయకత్వంలో పార్టీ వందేళ్ల వేడుకలలో ఒంగోలులో మహాసభలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు సహాయ సహకారాలను అందించాలని కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశం సంక్షోభంలో ఉందన్నారు. దేశంలో ఒడిదొడుకులున్నా, యుద్ధాలు జరిగినా అన్నింటినీ తట్టుకొని నిలబడి అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పారదర్శకత లోపించిందన్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని విమర్శించారు. వచ్చే నెల 2న అమరావతి పునఃశంకుస్థాపనకు ప్రధాని వస్తున్నారని, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందని గతంలో మోదీ ప్రకటించారని, దానిని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గోదావరి నుంచి బరంచర్ల ప్రాజెక్టుకు మరో రూ.80 కోట్లు అప్పులు తెచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ ఐదు రోజులపాటు నిర్వహించే మహాసభలలో ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 26 జిల్లాల నుంచి వెయ్యి మంది కళాకారులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రదాన కార్యదర్శి ఆర్. వెంకయ్య, ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు కేశరత్బాబు, సీపీఐ సీనియర్ నేత నల్లూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ బేతాళ శ్రీనివాసరావు ఒంగోలులో నిర్వహించనున్న సీపీఐ రాష్ట్రమహాసభలకు తమ కుటుంబం నుంచి ఒక నెల జీతం మూడు లక్షల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు.
మహాసభల కమిటి ఎన్నిక
ఒంగోలులో జరగనున్న సీపీఐ మహాసభల ఆహ్వాన సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీఐ రాష్ట్ర సీనియర్ నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు(అన్న) అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులుగా పీజే చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా సీపీఐ జిల్లాకార్యదర్శి ఎంఎల్ నారాయణ, కార్యనిర్వహక కార్యదర్శిగా ఆర్. వెంకట్రావు, కోశాధికారిగా కొత్తకోట వెంకటేశ్వర్లుతో ఆహ్వాన కమిటీ ఎన్నికైంది. ప్యాట్రన్గా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, మహాటీవీ అధినేత మారెళ్ల వంశీకృష్ణ, ప్రముఖ సినీగాయకుడు వందేమాతరం శ్రీనివాస్, నటులు మాదాల రవి, సినీ డైరెక్టర్ బాబ్జి, మద్దినేని రమేష్, గడ్డం కోటేశ్వరరావు, ఎన్,అంజయ్య, సిహెచ్ కోటేశ్వరరావు, రావుల వెంకయ్యతో పాటు పలువురిని ఎన్నుకున్నారు.