‘మీకోసం’కు గైర్హాజరుపై కలెక్టర్ సీరియస్
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:19 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)కు జిల్లా అధికారులు పలువురు గైర్హాజరు కావడంపై కలెక్టర్ పి.రాజాబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని మీకోసం హాలులో నిర్వహించిన కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు డుమ్మా కొట్టారు.
సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఆర్వోకు ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)కు జిల్లా అధికారులు పలువురు గైర్హాజరు కావడంపై కలెక్టర్ పి.రాజాబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని మీకోసం హాలులో నిర్వహించిన కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. రిజిస్టర్ను పరిశీలిం చిన కలెక్టర్ కొంతమంది అధికారుల స్థానంలో ఆ శాఖకు చెందిన ఇతర ఉద్యోగులు హాజరుకావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శాఖల వారీగా ఆయా అధికారుల వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన గైర్హాజరైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేశును ఆదేశించారు. ఆవిధంగా ఏడెనిమిది శాఖల అధికారులు మీకోసం కార్యక్రమానికి హాజరుకాలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.