Share News

రేషన్‌ పంపిణీ అక్రమాలకు చెక్‌

ABN , Publish Date - Sep 13 , 2025 | 10:40 PM

జిల్లాలో రేషన్‌ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రజా ప్రభుత్వం అందుకు అవసరమైన పటిష్ట చర్యలు చేపట్టింది. బియ్యం, చక్కెర, కందిపప్పు వంటి నిత్యావసరాల సరుకులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న స్మార్ట్‌ రైస్‌ కార్డులను ఈ నెలాఖరులోపు కార్డుదారులకు అందజేయనున్నారు.

రేషన్‌ పంపిణీ  అక్రమాలకు చెక్‌
ఈపోస్‌ మిషన్లను అందజేస్తున్న అధికారులు

1,392 ఈపోస్‌ మిషన్లు సిద్ధం

డీలర్లకు పంపిణీ చేస్తున్న పౌరసరఫరాల శాఖ అధికారులు

యంత్రాల వినియోగంపైనా అవగాహన

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్‌ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రజా ప్రభుత్వం అందుకు అవసరమైన పటిష్ట చర్యలు చేపట్టింది. బియ్యం, చక్కెర, కందిపప్పు వంటి నిత్యావసరాల సరుకులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న స్మార్ట్‌ రైస్‌ కార్డులను ఈ నెలాఖరులోపు కార్డుదారులకు అందజేయనున్నారు. అందుకు సంబంధించి ఈ-పో్‌సను మిషన్లను వచ్చేనెల నుంచి వినియోగించేందుకు జిల్లాకు రావడంతో వాటిని డీలర్లకు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 1,392 రేషన్‌షాపులు ఉండగా అన్నింటికీ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీలు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తమ పరిధిలోని డీలర్లకు అందిస్తున్నారు. ఈ కొత్త మిషన్ల వినియోగంపైనా అవగాహన కల్పిస్తున్నారు.

క్యూఆర్‌ కోడ్‌.. 5జీ నెట్‌వర్క్‌

ప్రస్తుతం ఇస్తున్న ఈపోస్‌ మిషన్ల ద్వారా స్మార్ట్‌ రేషన్‌ కార్డులోని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే కార్డుదారుని పూర్తి వివరాలు డిస్‌ప్లే అవుతుంది. కార్డుదారుడికి ఏయే సరుకులు అందజేయాలి, ఆ మిషన్‌లో నమోదు అవుతుంది. ఒక వేళ స్కాన్‌ పనిచేయని పక్షంలో వేలిముద్ర ద్వారానైనా సరుకులు తీసుకునే విధంగా మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఒకవేళ వేలిముద్ర పడకపోతే ఐరిష్‌(కళ్లు) స్కాన్‌ చేసే సదుపాయాన్ని కూడా కల్పించారు. ఇప్పటివరకు డీలర్ల వద్ద ఉన్న మిషన్లు 2జీ మాత్రమే ఉండగా ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఈపోస్‌ మిషన్లు 5జీ టెక్నాలజీతో అందిస్తున్నారు. తద్వారా కార్డుదారులకు వెంటనే రైస్‌ను అందించడంతోపాటు కార్డుదారుని వివరాలు కూడా వెంటనే డిస్‌ప్లే అయ్యే విధంగా రూపొందించారు. కాగా జిల్లావ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వారి పరిధిలోని డీలర్లకు వీటిని పంపిణీ చేస్తున్నారు. ఎన్‌జీపాడు మండలం అమ్మనబ్రోలులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో డీలర్లకు ఈ మిషన్లను అందజేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా మిషన్లను పంపిణీ చేస్తున్నారు.

Updated Date - Sep 13 , 2025 | 10:40 PM