మలుపులు సరిచేసేనా..?
ABN , Publish Date - May 30 , 2025 | 01:50 AM
ఇంకొల్లు - పర్చూరు పాతమద్రాసు రోడ్డులోని ప్రమాదకర మలుపులు వాహన చోదకులకు ప్రాణసంకటంగా మారాయి.
ఇంకొల్లు,మే 29,(ఆంధ్రజ్యోతి) : ఇంకొల్లు - పర్చూరు పాతమద్రాసు రోడ్డులోని ప్రమాదకర మలుపులు వాహన చోదకులకు ప్రాణసంకటంగా మారాయి. ఇప్పటికే పలువురి ప్రాణాలను తీసిన ఈ మలుపుల సమస్యకు అధికారులు పరిష్కారం చూపాల్సి ఉంది. ఈ రహదారిని కొత్తగా నిర్మించేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.23.88 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈక్రమంలో ఈ మలుపుల వద్ద తగు జాగ్రత్తలు తీసుకొంటే ప్రమాదాలు నివారించవచ్చు. ఆ దిశగా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
ఫ దగ్గుబాడు ఉన్నత పాఠశాలకు ప్రసన్నసుప్రజ కోల్డ్స్టోరేజ్ మధ్యలో 13వ మైలురాయి వద్ద రోడ్డు ఎక్కువ వంపు తిరిగి ఉంది. దగ్గరకు వచ్చే వరకు ఎదురెదురు వాహనాలు కనిపించవు. దీంతో వాహనాలు ఢీకొని గతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పొయారు. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన ప్రమాదాలలో సుమారు 13 మంది ప్రాణాలు కోల్పొయారు. ప్రమాదకరంగా ఉన్న ఈ ములపును కొంతమేరకు తగ్గించి సమాంతరంగా రోడ్డు నిర్మిస్తే ఇక్కడ ప్రమాదాలను నియంత్రించవచ్చునని సమీప గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. సంబంధిత ఆర్అండ్బీ అధికారులు దీని ఆవశ్యకతను గుర్తించి తగు సూచనలతో సమస్యను పరిష్కారదిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ దారిలోని పలుమలుపులను కూడా సరిచేయాలని కోరుతున్నారు.