Share News

బెల్ట్‌తో బాదుతూ.. కాళ్లతో తన్నుతూ..

ABN , Publish Date - Sep 17 , 2025 | 02:27 AM

తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడులో దారుణం చోటుచేసుకుంది. శాడిస్టు భర్త తన భార్య రెండు చేతులను పాక గుంజలకు కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అడ్డుకొని ఆమెను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. కలుజువ్వలపాడు గ్రామానికి చెందిన గురునాథం బాలాజీకి దగ్గర బంధువైన భాగ్యలక్ష్మితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది.

బెల్ట్‌తో బాదుతూ.. కాళ్లతో తన్నుతూ..

భార్య చేతులు కట్టేసి చిత్రహింసలు

కలుజువ్వలపాడులో శాడిస్టు భర్త దారుణం

రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకూ రాక్షసత్వం

సహకరించిన అతని అక్క, మేనల్లుడు

మరోసారి దాడికి యత్నం.. రక్షించిన స్థానికులు

తర్లుపాడు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడులో దారుణం చోటుచేసుకుంది. శాడిస్టు భర్త తన భార్య రెండు చేతులను పాక గుంజలకు కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అడ్డుకొని ఆమెను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. కలుజువ్వలపాడు గ్రామానికి చెందిన గురునాథం బాలాజీకి దగ్గర బంధువైన భాగ్యలక్ష్మితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మద్యానికి బానిసైన బాలాజీ భార్యను తీవ్రంగా హింసించేవాడు. ఈక్రమంలోనే కొంతకాలంగా భార్యాపిల్లల్ని వదిలేసి వేరే మహిళతో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. భాగ్యలక్ష్మి స్థానిక బేకరీలో పనిచేస్తూ పిల్లలను చదివిస్తోంది. శనివారం గ్రామానికి వచ్చిన బాలాజీ భార్యను డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఆమె రెండు చేతులను తాళ్లతో గుంజలకు కట్టేసి బెల్టుతో బాదుతూ, జుట్టుపట్టుకొని వెనక్కి విరిచి కాళ్లతో తన్నుతూ తీవ్రంగా హింసించాడు. బాలాజీకి అతని అక్క రమణమ్మ, మేనల్లుడు విష్ణు సహకరించారు. రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకూ రాక్షసత్వాన్ని కొనసాగించారు. మరలా సోమవారం రాత్రి ఆమెపై దాడికి ప్రయత్నించగా తప్పించుకొని సమీపంలోని చర్చి వద్దకు వెళ్లడంతో అక్కడ ఉన్న స్థానికులు భాగ్యలక్ష్మిని కాపాడారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మంగళవారం రాత్రి పొదిలి సీఐ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకొని బాధితురాలిని మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతోంది.

Updated Date - Sep 17 , 2025 | 02:31 AM