ఆస్తులకు ఆటో మ్యుటేషన్
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:24 AM
ఆస్తుల మార్పునకు, అవినీతి వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందుగా రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లలో ఆస్తులకు ’ఆటో మ్యుటేషన్’ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
ఆగస్టు 1 నుంచి కార్పొరేషన్లలో అమలు
ఇకపై అవకతవకలు, ఆలస్యానికి చెక్
రిజిస్ట్రేషన్లు పూర్తయిన వెంటనే పేరు మార్పు
ఒంగోలులో పటిష్టంగా అమలుకు చర్యలు
ఒంగోలు కార్పొరేషన్, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : ఆస్తుల మార్పునకు, అవినీతి వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందుగా రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లలో ఆస్తులకు ’ఆటో మ్యుటేషన్’ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.దీంతో రిజిస్ర్టేషన్ ప్రక్రియ వేగవంతంతోపాటు, సమయం ఆదా అవుతుంది. ఈ విధానం ఇప్పటికే విజయవాడ నగరంలో విజయవంతం కావడంతో తొలుత అన్ని కార్పొరేషన్లలో ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెస్తున్నారు. ఒంగోలు కార్పొరేషన్లో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేశారు.
ఇప్పటి వరకు ఇలా..
ఆస్తులు కొనుగోలు చేసిన తర్వాత వారి పేర్లపై హక్కులను బదలాయించడం కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ముగుస్తుంది. ఆతర్వాత కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లాలి. ఇంటి, కొళాయి పన్ను రశీదుల్లో పేరు మార్పు కోసం మార్కెట్లో ఆ ఆస్తి విలువలో ఒక శాతం మ్యుటేషన్ ఫీజుగా చలా నా చెల్లించి సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. సచివాలయంలో డాక్యుమెంట్లు పొందుపరచిన తర్వాత ఆర్ఐ, ఆర్వో లాగిన్లలో ప్రక్రియ పూర్తయి చివరికి కమిషనర్ లాగిన్కు చేరుతుంది. అందుకోసం రోజుల తరబడి తిరగడంతోపాటు రెవెన్యూ సెక్షన్ అధికారు లను ప్రసన్నం చేసుకోవాలి, అవసరమైతే వారడిగినంతా చెల్లించుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం 14 రోజుల్లో ఈ మొత్తం ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. అయితే రెవెన్యూ సిబ్బంది ఆశీస్సుల కోసం రోజులు, నెలల తరబడి కూడా తిరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆటో మ్యుటేషన్తో ఆ కష్టాలు తీరనున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తి బదలాయింపుతోనే అన్ని ప్రక్రియలు ఆటోమేటిక్గా పూర్తవుతాయి.
నూతన విధానంలో ఇలా..
ఆటో మ్యుటేషన్ అందుబాటులోకి వస్తే ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తి మ్యుటేషన్ కోసం కార్పొరేషన్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆస్తి విలువలో ఒక శాతం చలనా చెల్లిస్తే చాలు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో జరగ్గానే ఆటోమేటిక్గా ఆ డాక్యుమెంట్లు నేరుగా కమిషనర్ లాగిన్కు చేరుతాయి.ఆయన పరిశీలించి ఓకే చేసిన వెంటనే ఆస్తిని కొనుగోలు చేసిన యజమాని పేరుపైనే ఆన్లైన్లో మారిపోతుంది.ఇందుకు సంబంధించి ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ జరగాల్సి ఉంది. అందుకోసం ప్రభుత్వ శాఖ నుంచి సబ్ రిజిస్ట్రార్లు, కార్పొరేషన్ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ మేరకు శనివారం ఒంగోలు కళాక్షేత్రంలో నగర కమిషనరు కె.వెంకటేశ్వరరావుఆస్తులకు ఆటో మ్యుటేషన్పై కార్పొరేషన్ ఆధ్వర్యంలో సిబ్బంది అవసరమైన శిక్షణఇచ్చారు.